సోమవారం పార్లమెంటు బడ్జెట్ సమావేశంలో లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తన ప్రసంగం ప్రారంభించిన కొద్దిసేపటికే పార్లమెంటులో వాడీవేడి దృశ్యాలు కనిపించాయి. రాహుల్ గాంధీ కామెంట్లతో లోక్సభలో గందరగోళం తలెత్తింది. మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ నరవాణే రాసిన ప్రచురించని పుస్తకం నుండి సారాంశాలను కాంగ్రెస్ నాయకుడు చదవడానికి ప్రయత్నించడంతో, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అంతరాయం కలిగించడంతో పరిస్థితి మరింత దిగజారింది. చైనా సైన్యం భారత సరిహద్దుల్లోకి చొరబడుతుందని ఆరోపిస్తూ మాజీ ఆర్మీ చీఫ్ నరవణె ఇంకా ప్రచురించని బుక్లోని అంశమే ఆధారమన్నారు.
దీనిపై కేంద్రమంత్రులు రాజ్నాథ్, అమిత్ షా తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇంకా ప్రచురించని పుస్తకంలోని అంశాలపై ఎలా మాట్లాడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు అధికారికంగా ఈ విషయాన్ని విడుదల చేయలేదని, పార్లమెంటరీ కార్యకలాపాల సమయంలో దానిని ఉదహరించలేమని రాజ్నాథ్ సింగ్ వాదించారు. "ఆ పుస్తకం ప్రచురించబడిందో లేదో ఆయన మాకు చెప్పాలి. అది ప్రచురించబడలేదు. ఆయన దాని నుండి కోట్ చేసినట్లు చెప్పలేరు" అని రాజ్నాథ్ సింగ్ అన్నారు. "నేను నమ్మకంగా చెప్పగలను, పుస్తకం ప్రచురించబడలేదు" అని అన్నారు. అయితే తాను చెప్పింది వందశాతం నిజమని, దేశ భక్తి ఎవరికి ఉందో తెలుసని రాహుల్ స్పష్టం చేశారు.