నా తమ్ముడు నిజాయితీపరుడు.. పంజాబ్ దోపిడీ ఆగిపోతుంది : కేజ్రీవాల్

Punjab victory is a big revolution, says AAP chief Arvind Kejriwal. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన నేఫ‌థ్యంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్

By Medi Samrat  Published on  13 March 2022 12:39 PM GMT
నా తమ్ముడు నిజాయితీపరుడు.. పంజాబ్ దోపిడీ ఆగిపోతుంది : కేజ్రీవాల్

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన నేఫ‌థ్యంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ఆ పార్టీ సీఎం అభ్య‌ర్ధి భగవంత్ మాన్ ఆదివారం అమృత్‌సర్‌లో రోడ్‌షో నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ప్రజలను ఉద్దేశించి కేజ్రీవాల్ మాట్లాడుతూ.. పంజాబ్‌లో ఆప్ ఘనవిజయం సాధించడం ఒక పెద్ద విప్లవం (ఇంక్విలాబ్) అని.. రాష్ట్ర ప్రజలు మొదటిసారిగా నిజాయితీగల ముఖ్యమంత్రిని పొందుతారని అన్నారు. నా తమ్ముడు భగవంత్ మాన్ నిజాయితీపరుడు. పంజాబ్ దోపిడీ ఆగిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే లేదా మంత్రి దోపిడి చేస్తే జైలుకు పంపుతారు. ప్రభుత్వ సొమ్మును పంజాబ్‌కు ఖర్చు చేస్తారు. మా వాగ్దానాలన్నీ నెరవేరుస్తాం.. కొన్నింటికి సమయం పడుతుంది.. కొన్ని వెంటనే పూర్తి చేస్తామ‌ని కేజ్రీవాల్ అన్నారు.

పంజాబ్ ముఖ్యమంత్రి అభ్య‌ర్ధి భగవంత్ మాన్ మాట్లాడుతూ.. మేం 122 మంది భద్రతను తగ్గించాము. దాని కారణంగా 403 మంది పోలీసు సిబ్బంది, 27 పోలీసు వాహనాలు తిరిగి పోలీసు స్టేషన్‌లకు చేరుకున్నాయి. ఇక‌పై ఏ ప్రభుత్వ కార్యాలయంలోనూ సీఎం ఫోటోలు ఉండవు.. కానీ షహీద్ భగత్ సింగ్ మ‌రియు బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రాలు ఉంటాయని అన్నారు.

ఇదిలావుంటే.. పంజాబ్ కాబోయే ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఆప్‌ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ ఎన్నికలలో పార్టీ విజయాన్ని సెల‌బ్రేట్ చేసుకున్నారు. ముందుగా వీరు ఇరువురు అమృత్‌సర్ స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. అక్క‌డ ప్రార్థ‌న‌ల అనంత‌రం కేజ్రీవాల్‌తో కలిసి భగవంత్ మన్ నగరంలో రోడ్‌షో నిర్వహించనున్నారు. అంత‌కుముందు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ఈరోజు ఉద‌యం అమృత్‌సర్ చేరుకున్నారు. విమానాశ్రయంలో పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ వారికి స్వాగతం పలికారు.

Next Story