ఎయిర్ ఇండియా విమానాన్ని ఢీకొట్టిన‌ ప‌క్షి.. రిట్న‌ర్ జ‌ర్నీ క్యాన్సిల్‌

శుక్రవారం ఢిల్లీ నుంచి పూణె వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానాన్ని ఓ పక్షి ఢీకొట్టింది.

By Medi Samrat
Published on : 20 Jun 2025 3:12 PM IST

ఎయిర్ ఇండియా విమానాన్ని ఢీకొట్టిన‌ ప‌క్షి.. రిట్న‌ర్ జ‌ర్నీ క్యాన్సిల్‌

శుక్రవారం ఢిల్లీ నుంచి పూణె వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానాన్ని ఓ పక్షి ఢీకొట్టింది. దీంతో విమానయాన సంస్థ తిరుగు ప్రయాణాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని, పూణెలో ల్యాండ్ అయిన తర్వాత పక్షి కొట్టినట్లు గుర్తించామని ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. తదుపరి ప్రయాణం విష‌య‌మై విమానాన్ని నిలిపివేసినట్లు ఎయిర్‌లైన్స్ తెలిపింది. ఇంజినీరింగ్ బృందం విమానాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తోంది.

"జూన్ 20న పూణే నుండి ఢిల్లీకి వెళ్లాల్సిన AI-2470 విమానం పక్షుల దాడి కారణంగా రద్దు చేయబడింది.. ఇన్‌కమింగ్ ఫ్లైట్ పూణేలో సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత గుర్తించబడింది" అని ఎయిర్‌లైన్ తెలిపింది. ప్రయాణీకులకు వసతి, ఆహారం అందించడంతో సహా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు విమానయాన సంస్థ తెలిపింది. ప్రయాణీకుల టిక్కెట్ల రద్దుపై లేదా ప్రయాణాన్ని రీషెడ్యూల్ చేసిన తర్వాత డబ్బును వాపసు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. అలాగే ప్రయాణికులు ఢిల్లీ వెళ్లేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.

మరోవైపు ఎయిర్ ఇండియా ఈరోజు పలు విమాన సర్వీసులను రద్దు చేసింది. ఇప్పటివరకు నాలుగు అంతర్జాతీయ విమానాలతో సహా ఎనిమిది విమానాలను రద్దు చేసినట్లు ఎయిర్‌లైన్ సంస్ధ‌ తెలియజేసింది. నిర్వహణ మరియు కార్యాచరణ కారణాల వల్ల శుక్రవారం నాలుగు అంతర్జాతీయ సర్వీసులతో సహా ఎనిమిది విమానాలను ఎయిర్ ఇండియా రద్దు చేసినట్లు ఎయిర్‌లైన్స్ తెలిపింది.

ఇదిలా ఉండగా.. జూన్ 21 నుండి జూలై 15, 2025 వరకు ప్రతి వారం 38 అంతర్జాతీయ విమానాలను తగ్గించాలని.. మూడు విదేశీ మార్గాలలో సేవలను నిలిపివేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఇటీవలి విమాన ప్రమాదం తర్వాత విమానాలపై ప్రభావం చూపడంతో భద్రతా తనిఖీలు పెరిగాయి.

Next Story