ఢిల్లీ: కామన్వెల్త్ దేశాల స్పీకర్లు మరియు ప్రెసైడింగ్ ఆఫీసర్ల 28వ సదస్సు (CSPOC)ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ప్రారంభించనున్నారు. ఉదయం 10:30 గంటలకు న్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లో ఉన్న సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో ఈ సదస్సు ప్రారంభోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా ప్రధాని సదస్సును ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ అంతర్జాతీయ సదస్సుకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షత వహించనున్నారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 42 కామన్వెల్త్ దేశాలకు చెందిన 61 మంది స్పీకర్లు, ప్రెసైడింగ్ ఆఫీసర్లు, అలాగే 4 అర్ధ-స్వయంప్రతిపత్తి పార్లమెంట్ల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొననున్నారు.
ఈ సదస్సులో సమకాలీన పార్లమెంటరీ వ్యవహారాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చ జరగనుంది. ముఖ్యంగా.. ప్రజాస్వామ్య సంస్థలను బలోపేతం చేయడంలో స్పీకర్లు, ప్రెసైడింగ్ ఆఫీసర్ల పాత్ర..పార్లమెంటరీ కార్యకలాపాల్లో కృత్రిమ మేధ (AI) వినియోగం.. పార్లమెంట్ సభ్యులపై సోషల్ మీడియా ప్రభావం.. పార్లమెంట్పై ప్రజలకు అవగాహన పెంచే వినూత్న విధానాలు.. ఓటింగ్కే పరిమితం కాకుండా పౌరుల భాగస్వామ్యాన్ని విస్తరించే మార్గాలు.. వంటి అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నాయి.
ఈ సదస్సు ద్వారా కామన్వెల్త్ దేశాల మధ్య పార్లమెంటరీ సహకారం మరింత బలోపేతం కావడంతో పాటు, ప్రజాస్వామ్య వ్యవస్థలను ఆధునిక సాంకేతికతతో సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే దిశగా కీలక సూచనలు వెలువడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.