కార్గిల్ దివస్ సందర్భంగా పాకిస్థాన్‌కు ప్రధాని మోదీ హెచ్చరిక

జమ్మూ కాశ్మీర్‌లో దాడులు పెరుగుతున్న నేపథ్యంలో, కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్తాన్‌కు గట్టి హెచ్చరిక జారీ చేశారు.

By అంజి  Published on  26 July 2024 5:20 AM GMT
PM Modi, Pakistan, Kargil Diwas, terrorism, India

కార్గిల్ దివస్ సందర్భంగా పాకిస్థాన్‌కు ప్రధాని మోదీ హెచ్చరిక

జమ్మూ కాశ్మీర్‌లో దాడులు పెరుగుతున్న నేపథ్యంలో, కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్తాన్‌కు గట్టి హెచ్చరిక జారీ చేశారు. ప్రతి ఉగ్రవాద సవాళ్లను భారత్ ఓడిస్తుందని అన్నారు. పూర్తి శక్తితో ఉగ్రవాదాన్ని అణిచివేస్తామన్నారు. కార్గిల్ వార్ మెమోరియల్ వద్ద జరిగిన సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. భారతదేశం 25 ఏళ్ల క్రితం జరిగిన కార్గిల్ యుద్ధంలో విజయం సాధించడమే కాకుండా, “నిజం, సంయమనం, శక్తి”కి అద్భుతమైన ఉదాహరణను ఇచ్చిందని అన్నారు.

ఈ యుద్ధ నష్టం నుంచి పాకిస్థాన్ ఏమీ నేర్చుకోలేదని, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తోందని అన్నారు. పాకిస్తాన్ ఏదైనా దుష్ప్రవర్తనకు పాల్పడినప్పుడల్లా ఓటమిని ఎదుర్కొంది. చరిత్ర నుండి పాఠాలు నేర్చుకోలేదని అన్నారు. 25 ఏళ్ల క్రితం జరిగిన కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్లకు ప్రధాని నరేంద్ర మోదీ లడఖ్‌లోని కార్గిల్ వార్ మెమోరియల్ వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ప్రధాన మంత్రి వీర్ నారీస్ (యుద్ధ వితంతువులు)తో కూడా సంభాషించారు. షింకున్ లా టన్నెల్ ప్రాజెక్ట్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు.

కార్గిల్ విజయ్ దివస్, ప్రతి భారతీయుడికి చాలా ప్రత్యేకమైన రోజు అని ఎక్స్‌ పోస్ట్‌లో ప్రధాని మోదీ పేర్కొన్నారు. "ఇది మన దేశాన్ని రక్షించే వారందరికీ నివాళులర్పించే రోజు. షింకున్ లా టన్నెల్ ప్రాజెక్ట్‌లో కూడా పని ప్రారంభమవుతుంది. ముఖ్యంగా చెడు వాతావరణంలో లేహ్‌కు కనెక్టివిటీని మెరుగుపరచడానికి ఈ ప్రాజెక్ట్ ముఖ్యమైనది" అని ప్రధాని మోదీ అన్నారు.

షింకున్ లా టన్నెల్ ప్రాజెక్ట్ 4.1-కిమీ పొడవు గల ట్విన్-ట్యూబ్ టన్నెల్‌ను కలిగి ఉంది, ఇది లేహ్‌కు అన్ని వాతావరణ కనెక్టివిటీని అందించడానికి నిము-పాడుమ్-దర్చా రహదారిపై సుమారు 15,800 అడుగుల ఎత్తులో నిర్మించబడుతుంది. ఇది పూర్తయితే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సొరంగం అవుతుంది. షింకున్ లా టన్నెల్ సాయుధ దళాలు, సామగ్రి యొక్క వేగవంతమైన, సమర్థవంతమైన కదలికను నిర్ధారించడమే కాకుండా లడఖ్‌లో ఆర్థిక, సామాజిక అభివృద్ధిని కూడా ప్రోత్సహిస్తుంది.

జూలై 26, 1999న, భారత సైన్యం "ఆపరేషన్ విజయ్" విజయవంతమైందని ప్రకటించింది, లడఖ్‌లో దాదాపు మూడు నెలల సుదీర్ఘ యుద్ధం తర్వాత కార్గిల్ సెక్టార్‌లో నియంత్రణ రేఖకు భారత్ వైపున పాకిస్తాన్ చొరబాటుదారులు ఆక్రమించిన స్థానాలను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. యుద్ధంలో పాకిస్థాన్‌పై భారత్ సాధించిన విజయానికి గుర్తుగా ఈ రోజును 'కార్గిల్ విజయ్ దివస్'గా పాటిస్తారు.

అమరవీరులకు నాయకులు నివాళులు అర్పించారు

25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా, 1999లో కార్గిల్‌లో పాక్ చొరబాటుదారులతో పోరాడి ప్రాణాలు అర్పించిన 545 మంది సైనికులకు పార్టీలకు అతీతంగా పలువురు నాయకులు నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అమరుల త్యాగాలను స్మరిస్తూ ట్వీట్‌ చేశారు. డిఫెన్స్‌ మినిస్టర్‌ రాజ్‌నాథ్‌ సింగ్‌, చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ కార్గిల్‌ వీరులకు నివాళి అర్పించారు.

Next Story