అస్సాం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా దిబ్రూగఢ్ జిల్లాకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, బుధవారం మనోహరి టీ ఎస్టేట్ను సందర్శించి అక్కడి మహిళా కార్మికులతో కాసేపు సరదాగా గడిపారు. సంప్రదాయ ఎరుపు, తెలుపు రంగు చీరలు ధరించిన మహిళలతో కలిసి ఆయన తేయాకు ఆకులు కోస్తూ సందడి చేశారు.
ఈ సందర్భంగా టీ తోటల కుటుంబాల కఠోర శ్రమ అస్సాం గౌరవాన్ని పెంచిందని, వారి పట్టుదల పట్ల తాము గర్విస్తున్నామని ఆయన 'X' వేదికగా కొనియాడారు. తేయాకు కోత అనంతరం ఆ మహిళలతో కలిసి వారి సంస్కృతి గురించి ముచ్చటించిన ప్రధాని, వారితో సెల్ఫీలు కూడా దిగారు. బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచార సభల్లో పాల్గొనేందుకు ఒక రోజు పర్యటనకు వచ్చిన మోదీ, ఈ పర్యటనకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ టీ తోటల కార్మికులతో గడిపిన క్షణాలను గుర్తుచేసుకున్నారు.