ప్రధాని నరేంద్ర మోదీ తన 131వ 'మన్ కీ బాత్' కార్యక్రమంలో దేశ ప్రజలకు బ్యాంకు ఖాతాల భద్రతపై కీలక సూచనలు చేశారు. సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్థిక అప్రమత్తత అవసరమని ఆయన నొక్కి చెప్పారు. బ్యాంకులు అడిగే రీ-కేవైసీ ప్రక్రియపై చిరాకు పడొద్దని ప్రధాని కోరారు. ఇది కేవలం మీ సొంత సొమ్మును కాపాడుకోవడానికి చేసే ప్రక్రియేనని, మీ అకౌంట్ భద్రత కోసమే బ్యాంకులు ఇలా పదేపదే అడుగుతాయని ఆయన వివరించారు.
పాస్వర్డ్లు మారుస్తుండండి:
మీ బ్యాంకు ఖాతా పాస్వర్డ్లను తరచుగా మార్చడం అలవాటు చేసుకోవాలని ప్రధాని సూచించారు. పెన్షన్లు, సబ్సిడీలు, బీమా, యూపీఐ అన్నీ అకౌంట్తో లింక్ అయి ఉండటం వల్ల చిన్న పొరపాటు జరిగినా పెద్ద నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కేవైసీ పేరుతో వచ్చే ఫేక్ కాల్స్, సందేహాస్పద ఎస్ఎంఎస్లు, వెబ్సైట్ లింక్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
కేవైసీ అప్డేట్ చేయాలనుకుంటే నేరుగా బ్యాంకు బ్రాంచీకి వెళ్లాలని లేదా బ్యాంకు అధికారిక యాప్ ద్వారానే చేయాలని సూచించారు. ఎవరికీ ఓటీపీ (OTP), ఆధార్ నంబర్, పిన్ వివరాలు చెప్పకూడదని స్పష్టం చేశారు. ఆర్థిక అక్షరాస్యతను పెంచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చేపట్టిన వారోత్సవాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ప్రధాని పిలుపునిచ్చారు.