ఢిల్లీలో ఎన్డీఏ నాయకులతో జరిగిన సమావేశంలో ప్రధాని మోదీ అనవసరమైన ప్రకటనలు చేయకుండా ఉండాలని ఆ పార్టీ నాయకులను కోరారు. పాకిస్తాన్ అభ్యర్థన మేరకు ఆపరేషన్ సిందూర్ కాల్పుల విరమణ ప్రారంభించబడిందని, దీనికి మూడవ పక్షం ప్రమేయం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల బీజేపీ నేతలు కొందరు చేసిన కామెంట్లు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మోడీ ఆ వ్యాఖ్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం. నేతలు బహిరంగ ప్రకటనలు చేసేటప్పుడు సంయమనంతో వ్యవహరించాలని అనవసర వ్యాఖ్యలు చేయవద్దని సూచించినట్టు తెలుస్తోంది. ఎన్డీఏ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
కాగా ఆపరేషన్ సిందూర్ విషయంలో కల్నల్ సోఫియా కురేషీపై మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా చేసిన కామెంట్లు దేశవ్యాప్తంగా విమర్శలకు దారి తీశాయి. టెర్రరిస్టుల సోదరి అంటూ విజయ్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్లపై సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు బీజేపీ రాంచందర్ జాంగ్రా కూడా పహల్గామ్ ఎటాక్ లో చనిపోయిన వారి భార్యలను ఉద్దేశించి ఆ మహిళలకు ధైర్యం, పోరాట స్పూర్తి ఉంటే మరణాల సంఖ్య తక్కువగా ఉండేదని చెప్పడం కూడా వివాదాస్పదం అయ్యింది. ఈ నేపథ్యంలోనే ప్రధాని బీజేపీ నేతలకు వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.