దేశంలో వైద్యుల సంఖ్య పెంచేందుకు పెద్దపీట వేస్తున్నాం : అమిత్ షా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీని, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ప్రశంసించారు.
By Medi Samrat
కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీని, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ప్రశంసించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలో ఆరోగ్య సంబంధిత సమస్యలను సమగ్ర దృక్పథంతో పరిష్కరించిందని ఆయన అన్నారు. బెంగళూరులోని ఆదిచుంచనగిరి యూనివర్శిటీ కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవంలో షా మాట్లాడారు.
పేదల అతిపెద్ద సమస్య అనారోగ్యం.. వారు వైద్యం కోసం చేసే ఖర్చు చాలా ఎక్కువ అని మా నాయకుడు నరేంద్ర మోదీ చాలా ఏళ్ల క్రితం గుజరాత్లో చెప్పారని ఆయన అన్నారు. పేదలను ఆదుకునే బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని కూడా అన్నారు. అలాగే.. మోదీ ప్రధాని అయిన తర్వాత ఏటా 60 కోట్ల మంది పేదలకు రూ.5 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందించినందుకు ఈరోజు గర్వపడుతున్నాను.
12 కోట్ల ఇళ్లలో మరుగుదొడ్ల నిర్మాణం, ఫిట్ ఇండియా ఉద్యమం, యోగా దినోత్సవం, మిషన్ ఇంద్రధనుష్, పోషకాహార ప్రచారం, ఆయుష్మాన్ భారత్, భారతీయ జన్ ఔషధి ప్రాజెక్ట్ వంటి ఆరోగ్యానికి సంబంధించిన అనేక కార్యక్రమాలను మోదీ ప్రభుత్వం ప్రారంభించిందని షా చెప్పారు. ఒక పౌరుడు తల్లి కడుపున పుట్టినప్పటి నుంచి నిండు పౌరుడిగా మారే వరకు ఎలాంటి రోగాల బారిన పడకూడదని, అనారోగ్యానికి గురైతే వైద్యం ఖర్చుతో కూడుకున్నది కాకూడదని.. ప్రభుత్వం భరోసా కల్పిస్తోందన్నారు.
దేశంలో వైద్యుల సంఖ్యను పెంచేందుకు పెద్దపీట వేస్తున్నట్లు హోంమంత్రి తెలిపారు. 2014లో దేశంలో 7 ఎయిమ్స్ ఉండగా, ఇప్పుడు 23 ఎయిమ్స్ ఉన్నాయి. మెడికల్ కాలేజీల సంఖ్య 387 నుంచి 780కి పెరిగింది. 2014లో 51,000 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా, నేడు ఆ సంఖ్య 1,18,000కు పెరిగిందన్నారు. పీజీ సీట్లు 31,000 నుంచి 74,000కు పెరిగాయి. అంటే దేశంలో ఏటా 1,18,000 మంది ఎంబీబీఎస్ వైద్యులు, 74,000 మంది స్పెషలిస్ట్ వైద్యులు తయారవుతున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి, రైల్వే శాఖ సహాయ మంత్రి వి సోమన్న, ఆదిచుంచంగిరి మఠం నిర్మలానందనాథ్ మహాస్వామీజీ తదితరులు పాల్గొన్నారు.