పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCS) సమావేశాన్ని నిర్వహించారు. అంతర్జాతీయ పరిస్థితుల వల్ల దేశీయంగా ఇంధన మరియు నిత్యావసర వస్తువుల సరఫరాకు ఆటంకం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో సమీక్షించారు. ముఖ్యంగా ఎల్పీజీ (LPG), ఎల్ఎన్జీ (LNG) దిగుమతులను కేవలం కొన్ని దేశాలకే పరిమితం చేయకుండా, వివిధ దేశాల నుంచి సేకరించడం ద్వారా సరఫరాను స్థిరీకరించాలని నిర్ణయించారు. దేశీయంగా గ్యాస్ ధరలు పెరగకుండా చూడటంతో పాటు, అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్పై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
విద్యుత్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని బొగ్గు నిల్వలను సిద్ధం చేయడం, గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలకు నిబంధనలు సడలించడం వంటి అంశాలపై చర్చించారు. వ్యవసాయ రంగానికి ఇబ్బంది కలగకుండా యూరియా, డీఏపీ ఎరువుల లభ్యతను పర్యవేక్షించాలని ప్రధాని సూచించారు. నిత్యావసర వస్తువుల ధరలు స్థిరంగా ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ ధరల నియంత్రణకు ప్రత్యేక కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. అంతర్జాతీయ సంక్షోభం ప్రభావం సామాన్యులపై పడకుండా అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని, తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా ఎప్పటికప్పుడు ఖచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలని మోదీ అధికారులను ఆదేశించారు.