భారీగా పెట్రోల్‌ ధర తగ్గింపు.. రూ.8 వ్యాట్‌ తగ్గించిన ప్రభుత్వం.!

Petrol becomes cheaper in Delhi after govt reduces VAT by Rs 8. పెట్రోల్‌ ధర లీటరుకు రూ.8 తగ్గింది. తాజా తగ్గింపు తర్వాత లీటర్ పెట్రోల్ ధర కేవలం రూ.95 మాత్రమే లభిస్తోంది.

By అంజి  Published on  1 Dec 2021 8:26 AM GMT
భారీగా పెట్రోల్‌ ధర తగ్గింపు.. రూ.8 వ్యాట్‌ తగ్గించిన ప్రభుత్వం.!

సామాన్య ప్రజలకు ఇంధన ధరలపై ఊరట కలిగించేందుకు ఢిల్లీ ప్రభుత్వం పెట్రోల్‌పై విధించే వ్యాట్‌ (విలువ ఆధారిత పన్ను)ను భారీగా తగ్గించింది. ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ కేబినెట్‌ బుధవారం సమావేశం అయ్యింది. ఈ సమావేశంలో వ్యాట్‌ను తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత దేశ రాజధానిలో పెట్రోల్‌ ధర లీటరుకు రూ.8 తగ్గింది. తాజా తగ్గింపు తర్వాత దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్ ధర కేవలం రూ.95 మాత్రమే లభిస్తోంది.

పౌరులకు ఉపశమనం కలిగించే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం గత నెలలో పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన తర్వాత ఢిల్లీ ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. నవంబర్ మొదటి వారంలో కేంద్రం పెట్రోల్‌పై లీటరుకు రూ.5, డీజిల్‌పై రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ ప్రభుత్వం పెట్రోల్‌పై వ్యాట్‌ను 30 శాతం నుంచి 19.40 శాతానికి తగ్గించడంతో పెట్రోల్ ధర రూ.103.97 నుంచి రూ.95.97కి భారీగా తగ్గడం గమనార్హం. వ్యాట్‌ తగ్గింపుతో దేశ రాజధానిలోని పౌరులు నెలల తరబడి లీటరు ఇంధనం కోసం రూ. 100కు పైగా చెల్లిస్తున్నందున వారికి చాలా ఊరట కల్పించింది.

ఢిల్లీ ప్రభుత్వం పెట్రోల్‌పై వ్యాట్‌ను తగ్గించినప్పటికీ, డీజిల్ ధరలపై అలాంటి నిర్ణయం తీసుకోలేదు. దేశ రాజధానిలో లీటర్ డీజిల్ ధర రూ.86.67గా ఉంది. ఇక తెలంగాణలోని హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్ ధర రూ.108.20 వద్ద కొనసాగుతుండగా డీజిల్ ధర లీటరుకు రూ.94.62 వద్ద ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ గుంటూరు, అమరావతిలో కూడా పెట్రోల్ రేటు లీటరుకు రూ.110.67 వద్ద ఉంది. డీజిల్ ధర రూ.96.08 వద్ద స్థిరంగా ఉంది.

Next Story