ట్రాన్స్జెండర్ల హక్కుల సవరణ బిల్లుకు పార్లమెంట్ పచ్చజెండా
ట్రాన్స్జెండర్ వ్యక్తుల హక్కుల పరిరక్షణకు సంబంధించి 2019 నాటి చట్టాన్ని సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కీలక బిల్లుకు పార్లమెంట్ బుధవారం ఆమోదం తెలిపింది.
By - Knakam Karthik |
ట్రాన్స్జెండర్ల హక్కుల సవరణ బిల్లుకు పార్లమెంట్ పచ్చజెండా
ఢిల్లీ: ట్రాన్స్జెండర్ వ్యక్తుల హక్కుల పరిరక్షణకు సంబంధించి 2019 నాటి చట్టాన్ని సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కీలక బిల్లుకు పార్లమెంట్ బుధవారం ఆమోదం తెలిపింది. మంగళవారం లోక్సభ ఆమోదం పొందిన ఈ బిల్లుకు, బుధవారం రాజ్యసభ కూడా మూజువాణి ఓటుతో పచ్చజెండా ఊపింది. ఈ సవరణల ద్వారా ట్రాన్స్జెండర్ వ్యక్తులపై జరిగే దాడులు లేదా వేధింపుల తీవ్రతను బట్టి నేరస్తులకు శ్రేణీకృత శిక్షలను విధించేలా చట్టాన్ని కఠినతరం చేశారు. ముఖ్యంగా, 'ట్రాన్స్జెండర్' అనే పదానికి స్పష్టమైన నిర్వచనాన్ని ఇస్తూనే, కేవలం సామాజిక ధోరణులు లేదా వ్యక్తిగత లైంగిక ప్రాధాన్యతలను కాకుండా, జీవసంబంధమైన కారణాల వల్ల వివక్షను ఎదుర్కొంటున్న వారికి చట్టపరమైన రక్షణ కల్పించడమే ఈ సవరణ ప్రధాన లక్ష్యం.
ఈ బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చకు సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ సమాధానమిస్తూ, ఇది సమాజంలోని అన్ని వర్గాలను కలుపుకొని వెళ్లే ప్రక్రియ అని పేర్కొన్నారు. వివక్షకు గురవుతున్న ట్రాన్స్జెండర్లను ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చి, వారు ఆత్మగౌరవంతో జీవించేలా చేయడమే మోదీ ప్రభుత్వ ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే 30కి పైగా రాష్ట్రాల్లో ట్రాన్స్జెండర్ సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేశామని, ఈ కొత్త సవరణల వల్ల పరిపాలనాపరమైన స్పష్టత రావడంతో పాటు వారి హక్కులకు మరింత భద్రత లభిస్తుందని మంత్రి వివరించారు.
ప్రతిపక్షాలు ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని డిమాండ్ చేసినప్పటికీ, సభ ఆ ప్రతిపాదనలను తిరస్కరించింది. అలాగే ప్రతిపక్షం సూచించిన పలు సవరణలను వీగిపోయిన తర్వాతే బిల్లుకు ఆమోదం లభించింది. ఈ చట్టం అమలులోకి రావడం ద్వారా ట్రాన్స్జెండర్లకు అధికారికంగా గుర్తింపు లభించడమే కాకుండా, వారి సామాజిక మరియు ఆర్థిక సాధికారతకు మార్గం సుగమం కానుంది. కేవలం జీవసంబంధిత సమస్యలతో బాధపడేవారికి మాత్రమే ఈ చట్ట పరిధి వర్తిస్తుందని ప్రభుత్వం ఈ సందర్భంగా స్పష్టత ఇచ్చింది.