మిజోరంలో కొత్త టెన్షన్.. బంగ్లాదేశ్, మయన్మార్ దేశాల నుండి వచ్చిన ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్
Over 1,700 pigs die in one month in Mizoram. దేశం ఓవైపు కరోనా టెన్షన్ లో ఉన్న సంగతి తెలిసిందే..! కరోనాను కట్టడి చేయడానికి అధికారులు
By Medi Samrat Published on 7 May 2021 1:38 PM GMTదేశం ఓవైపు కరోనా టెన్షన్ లో ఉన్న సంగతి తెలిసిందే..! కరోనాను కట్టడి చేయడానికి అధికారులు ఎంతగానో ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్(ఏఎస్ఎఫ్) మిజోరం అధికారులను తెగ టెన్షన్ పెడుతూ ఉంది. ఎందుకంటే ఈ ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కారణంగా నెల రోజుల్లో 1700కు పైగా పందులు మరణించాయి. గత మార్చి 21న తొలి మరణం నమోదు కాగా, ఇప్పటి వరకు మొత్తం 1728 పందులు మృతిచెందాయి. ఈ వ్యాధి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పాకుతూ రాష్ట్రమంతటా పాకిందని అధికారులు చెబుతూ ఉన్నారు. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కారణంగా పందుల మరణాల రూపంలో రూ.6.91 కోట్ల నష్టం వాటిల్లిందని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఐజ్వాల్, లంగ్లేయ్, సెర్చిప్, లౌంగ్ట్లాల్, మామిత్ జిల్లాల్లో వ్యాధి తీవ్రత ఆందోళన కలిగిస్తున్నదని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో చావులు తగ్గుతూ ఉన్నా కూడా ఇంకొన్ని ప్రాంతాలకు పాకుతూ ఉందనే టెన్షన్ అధికారుల్లో ఎక్కువగా ఉంది.
అస్సాం స్టేట్ అనిమల్ హస్బెండరీ అండ్ వెటర్నరీ డిపార్ట్మెంట్ జాయింట్ డైరెక్టర్(లైవ్ స్టాక్ హెల్త్) డాక్టర్ లాల్మింగతాంగ మాట్లాడుతూ ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కారణంగా కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పందుల మరణం జరిగిందని అన్నారు. ఓ ప్రాంతం నుండి ఇతర ప్రాంతాలకు చాలా తొందరగా పాకేసిందని తెలిపారు. చాలా ప్రాంతాల్లోకి పందుల పెంపకందార్లను అలర్ట్ కూడా చేశామని అన్నారు. ఏయే ప్రాంతాల్లో ఈ వ్యాధి ఉందని ప్రభుత్వం భావిస్తూ ఉందో.. ఆ ప్రాంతాల్లోనే కాకుండా మిగిలిన ప్రాంతాల్లో కూడా పందులు మరణించడం ఆందోళన కలిగిస్తూ ఉందని అన్నారు. ఇతర ప్రాంతాల్లో కూడా 866 పందులు చనిపోయాయని..ఆ చనిపోయిన పందుల నుండి శాంపుల్స్ ను సేకరించామని అన్నారు. ఈ ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ బంగ్లాదేశ్, మయన్మార్ దేశాల నుండి వచ్చినట్లుగా అధికారులు భావిస్తూ ఉన్నారు.