న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాల వేళ కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య పోరు తారాస్థాయికి చేరింది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని 'ఇండియా'కూటమి మంగళవారం అధికారికంగా నోటీసు ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం లోక్సభ సెక్రటరీ జనరల్కు కాంగ్రెస్ ఎంపీలు నోటీసులు అందించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 94-C కింద అవిశ్వాస తీర్మానం నోటీసును అందజేసినట్లు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ తెలిపారు. కాంగ్రెస్, డీఎంకే, ఎస్పీ తదితర పార్టీలకు చెందిన 120 మంది ఎంపీలు నోటీసులపై సంతకాలు చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు చెప్పాయి.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని మాట్లాడనివ్వకపోవడంపై విపక్షాలు ఆగ్రహంతో ఉన్నాయి. మహిళా MPల పేర్లు ప్రస్తావించడంపైనస 8మంది ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేయడంపైన కూడా అసంతృప్తితో అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చినట్లు సమాచారం. అధికారపక్ష ఎంపీలకు ప్రత్యేక హక్కులు కల్పిస్తున్నట్లుగా స్పీకర్ వైఖరి ఉందని విపక్షం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే స్పీకర్ను తొలిగించాలని అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.