30కి పైగా విమానాలను పేల్చివేస్తామని మరోసారి బెదిరింపులు..!

దేశ వ్యాప్తంగా విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. శనివారం 30కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు వ‌చ్చాయి.

By Medi Samrat  Published on  26 Oct 2024 3:45 PM GMT
30కి పైగా విమానాలను పేల్చివేస్తామని మరోసారి బెదిరింపులు..!

దేశ వ్యాప్తంగా విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. శనివారం 30కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు వ‌చ్చాయి. దీంతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. సెక్యూరిటీ ప్రోటోకాల్‌ ప్రకారం.. విమానాలను తనిఖీ చేశారు. సోషల్ మీడియా పోస్టుల ద్వారా.. 13 రోజుల్లో 300లకు పైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు చెబుతున్నారు. అయితే ఆ బెదిరింపులన్నీ నకిలీవని తేలింది.

శనివారం ఇండిగో, ఎయిర్ ఇండియా, విస్తారాకు చెందిన 11 విమానాలకు బెదిరింపులు వచ్చాయి. మా చాలా విమానాలకు శనివారం సోషల్ మీడియా ద్వారా బెదిరింపులు వచ్చాయని ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి తెలిపారు.

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లోని పది హోటళ్లకు శనివారం బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. తర్వాత అది అబద్ధమని తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్నం 12.45 గంటలకు ఈమెయిల్ వచ్చింది. ఆ తర్వాత పోలీసులు బాంబు నిర్వీర్య స్క్వాడ్‌తో కలిసి ఈ హోటళ్లలో క్షుణ్ణంగా సోదాలు నిర్వహించారు.

స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) పోలీసు ఇన్‌స్పెక్టర్ S.M. జడేజా మాట్లాడుతూ.. ఈ పది హోటళ్లలో తానే బాంబులు పెట్టినట్లు బెదిరింపుల‌కు పాల్ప‌డిన వ్య‌క్తి స్వయంగా చెప్పాడని.. ఆ బాంబు మరికొన్ని గంటల్లో పేలుతుందని కూడా చెప్పిన‌ట్లు వెల్ల‌డించాడు. అయితే దాదాపు ఐదు గంటలపాటు వెతికినా అనుమానాస్పదంగా ఏమీ దొరకలేదు. వీటిలో ఇంపీరియల్ ప్యాలెస్, సయాజీ హోటల్, సీజన్స్ హోటల్, హోటల్ గ్రాండ్ రీజెన్సీ, భాభా హోటల్‌తో సహా పది హోటళ్లు ఉన్నాయి.

బాంబు బెదిరింపులకు సంబంధించి ఫేక్ కాల్స్‌పై ఐటీ మంత్రిత్వ శాఖ అడ్వైజరీ జారీ చేసింది. మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుండి కూడా సహాయం కోరింది. సమాచారం ప్రకారం.. ఈ సమస్యను పరిష్కరించేందుకు మంత్రిత్వ శాఖ X, Meta ఇతర ప్లాట్‌ఫారమ్‌లను సంప్రదించింది. నకిలీ బాంబు బెదిరింపుల విషయంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు 'తగిన శ్రద్ధ' పాటించడంలో విఫలమైతే పర్యవసానంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.

Next Story