రాజస్థాన్లోని నాన్ వెజ్ ఫుడ్ ప్రియులకు ఆ రెండు రోజులు గడ్డుకాలమే. ఆగస్టు 28న పరయూషన్ పండుగ, సెప్టెంబర్ 6 (శనివారం) అనంత చతుర్దశి సందర్భంగా ఈ రెండు రోజులు రాష్ట్రవ్యాప్తంగా నాన్ వెజ్ షాపులు, కబేళాలు పూర్తిగా మూతపడతాయని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. తొలిసారిగా గుడ్డు విక్రయదారులను కూడా ప్రభుత్వం చేర్చడం విశేషం. ఈ రెండు రోజుల్లో మటన్, చికెన్ లేదా పచ్చి మాంసం విక్రయించే దుకాణాలు మాత్రమే కాకుండా.. గుడ్లు విక్రయించే బండ్లు.. హోటల్-ధాబాలు కూడా గుడ్లు విక్రయించకూడదు.
రాష్ట్రంలో ఈ మతపరమైన పండుగల సందర్భంగా కబేళాలు, మాంసం విక్రయ దుకాణాలు చాలా కాలంగా మూసివేసే నిబంధన ఉంది. ముఖ్యంగా జైన సంఘం, ఇతర మత సంస్థల డిమాండ్పై ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఈ ఉత్తర్వును జారీ చేస్తోంది. అయితే ఈ సారి మాత్రమే తేడా ఏమిటంటే.. కోడిగుడ్డు విక్రయదారులను కూడా చేర్చారు. ఈ రెండు తేదీల్లో నాన్వెజ్ ఆహారాన్ని విక్రయించడం, కోయడం, వండడం, వడ్డించడం వంటివి చేయరాదని స్వయంప్రతిపత్త ప్రభుత్వ శాఖ స్పష్టం చేసింది. ఉత్తర్వులను ఉల్లంఘిస్తే మున్సిపల్ కార్పొరేషన్ మరియు స్థానిక పరిపాలన చర్యలు తీసుకుంటుంది.
మతపరమైన పండుగలలో జంతువులను చంపడాన్ని నిరోధించడానికి స్లాటర్ హౌస్లు, మాంసం దుకాణాలను మూసివేస్తే కోడిగుడ్ల అమ్మకాన్ని నిషేధించాలని జైన సంఘం, కొన్ని ఇతర మత సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. గుడ్డును కూడా జీవిగానే పరిగణిస్తారని, అందుకే దానిని నాన్ వెజ్ కేటగిరీగా పరిగణించి నిషేధించాలని మత సంస్థలు కోరుతున్నాయి. ఈసారి ప్రభుత్వం వారి డిమాండ్ను అంగీకరించి తొలిసారిగా కోడిగుడ్ల విక్రయాలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వుల్లో చేర్చింది.