15 ఏళ్లు పైబడిన వాహనాలకు ఇంధనం బంద్.. ప్రభుత్వం సంచలన నిర్ణయం
వాహనాల విషయంలో ఢిల్లీ ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయం తీసుకుంది.
By Medi Samrat Published on 1 March 2025 3:15 PM IST
వాహనాల విషయంలో ఢిల్లీ ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 తర్వాత ఢిల్లీలోని పెట్రోల్ పంపుల వద్ద 15 ఏళ్ల కంటే పాత వాహనాలకు ఇంధనం ఇవ్వబోమని పర్యావరణ శాఖ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా తెలిపారు. దేశ రాజధానిలో వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి చర్యలపై చర్చించడానికి అధికారులతో సమావేశం తరువాత సిర్సా.. వాహనాల కాలుష్యాన్ని అరికట్టడానికి ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటోందని చెప్పారు.
పాత వాహనాలపై ఆంక్షలు, తప్పనిసరి స్మోగ్ నిరోధక చర్యలు, ఎలక్ట్రిక్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కు మారడం వంటి కీలక విధాన నిర్ణయాలపై సమావేశం దృష్టి సారించింది. "మేము పెట్రోల్ పంపుల వద్ద 15 సంవత్సరాల కంటే పాత వాహనాలను గుర్తించే గాడ్జెట్లను ఇన్స్టాల్ చేస్తున్నాము.. వాటికి ఇంధనం అందించబడదు" అని సిర్సా సమావేశం తరువాత చెప్పారు.
ఈ నిర్ణయాన్ని ఢిల్లీ ప్రభుత్వం కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖకు తెలియజేస్తుందని ఆయన తెలిపారు. పాత వాహనాలకు ఇంధన సరఫరాను పరిమితం చేయడంతో పాటు, వాయు కాలుష్య స్థాయిలను అరికట్టడానికి రాజధానిలోని అన్ని ఎత్తైన భవనాలు, హోటళ్లు, వాణిజ్య సముదాయాలు తప్పనిసరిగా యాంటీ స్మోగ్ గన్లను ఏర్పాటు చేయాలని సిర్సా ప్రకటించారు. ఇంకా ఢిల్లీలోని దాదాపు 90 శాతం పబ్లిక్ సిఎన్జి బస్సులను డిసెంబర్ 2025 నాటికి దశలవారీగా నిలిపివేస్తామని.. క్లీనర్, సుస్థిరమైన ప్రజా రవాణా వైపు ప్రభుత్వం చేస్తున్న పుష్లో భాగంగా వాటి స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు ఉంటాయని ఆయన చెప్పారు.