పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. 2025 - 26 ఆర్థిఇక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. వరుసగా 8 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఘనతను ఆమె సొంతం చేసుకున్నారు. ఈసారి కూడా పేపర్ లెస్ బడ్జెట్ను ప్రవేశ పెట్టారు. బడ్జెట్ ప్రసంగం సందర్భంగా లోక్సభలో ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి.
కుంభమేళా తొక్కిసలాటపై చర్చకు డిమాండ్ చేశాయి. నిరసనల మధ్య నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. 'దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్' అనే గురజాడ అప్పారావు కవితను తెలుగులో ప్రస్తావించారు. 2025 - 26 పద్దు 5 లక్ష్యాలను వివరించారు. వృద్ధిని పెంచడం, సమ్మిళిత అభివృద్ధి, ప్రైవేట్ సెక్టార్ పెట్టుబడులు పెంచడం, హౌస్హోల్డ్ సెంటిమెంటు పెంచడం, భారత్లో పెరుగుతున్న మధ్య తరగతి స్పెండింగ్ పవర్ను వృద్ధి చేయడం.
అలాగే కేంద్ర బడ్జెట్లో గరీబ్, యూత్, అన్నదాత, నారీ వర్గాలకు ప్రాధాన్యమిచ్చామని నిర్మలా సీతారామన్ తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. తాము చేపట్టిన సంస్కరణలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయని, అధికవృద్ధి సాధిస్తున్న దేశంగా భారత్ నిలిచిందని ఆమె తెలిపారు. బడ్జెట్లో భాగంగా ప్రధానమంత్రి ధన్ ధాన్య యోజన స్కీమ్ను ఆర్థికమంత్రి ప్రకటించారు. పప్పు ధాన్యాల కోసం ఆరేళ్ల ప్రణాళిక ప్రారంభిస్తామని చెప్పారు. ప్రయోగాత్మకంగా వంద జిల్లాల్లో పీఎం ధన్ ధాన్య యోజన స్కీమ్ను అమలు చేస్తామని పేర్కొన్నారు. గోదాములు, నీటి పారుదల, రుణ సౌకర్యాలు కల్పిస్తామన్నారు. దీని ద్వారా 1.7 కోట్ల మంది రైతులకు లాభం చేకూరుతుందని తెలిపారు.