ఢిల్లీలోని ఎర్రకోటలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్మారకార్థం 2019లో ఏర్పాటు చేసిన మ్యూజియానికి.. నేతాజీ వారసులు ఆయన వినియోగించిన టోపీని అందించిన విషయం తెలిసిందే. అయితే.. ఆ టోపీని కేంద్రం ఈ ఏడాది జనవరిలో కోల్కతాకు తరలించింది. టోపీని తరలించడంపై చంద్రకుమార్ బోస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము బహూకరించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ టోపీని అన్ని చోట్లకు తరలించడం సరికాదని.. ఆ టోపీని ఎర్రకోటలోనే భద్రంగా ఉంచాలని నేతాజీ మనవడు చంద్రకుమార్ బోస్ ట్వీట్ చేశారు. ట్వీట్కు 'నేతాజీ క్యాప్ మిస్సింగ్' హ్యాష్ట్యాగ్ జతచేశారు.
అయితే.. చంద్రకుమార్ బోస్ చేసిన ట్వీట్ పై కేంద్రం స్పందించింది. ఆ టోపీ భద్రంగానే ఉందని, కోల్కతాలోని విక్టోరియా మెమోరియల్లో ప్రత్యేక దర్శనం కోసం తరలించామని పేర్కొంది. ఈ విషయమై కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ మాట్లాడుతూ.. నేతాజీ 125వ జయంత్యుత్సవాల సందర్భంగా.. కోల్కతాలో ఏర్పాటు చేసిన ప్రదర్శన కోసమే టోపీని తరలించినట్టు చెప్పారు. జులై 18 తర్వాత తిరిగి ఎర్రకోటకు తీసుకొచ్చి భద్రపరుస్తామని పేర్కొన్నారు.