జూన్ 15న జరగాల్సిన నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్-పోస్ట్ గ్రాడ్యుయేట్ (నీట్-పీజీ) 2025 పరీక్షను రెండు షిఫ్ట్లలో కాకుండా ఒకే షిప్టులో నిర్వహించాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. ఒకే షిఫ్టులో పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని, పూర్తి పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం సంబంధిత అధికారులను ఆదేశించింది.
న్యాయమూర్తులు సంజయ్ కుమార్, ఎన్వీ అంజరియాలతో కూడిన ధర్మాసనం రెండు షిఫ్టుల్లో పరీక్ష నిర్వహించడం ‘ఏకపక్షం’కు దారితీస్తుందని పేర్కొంది. రెండు వేర్వేరు ప్రశ్నపత్రాల క్లిష్టత స్థాయి లేదా సౌలభ్యం ఎప్పుడూ ఒకేలా ఉండదని కోర్టు వ్యాఖ్యానించింది. అందువల్ల, ఏకరూపత, సరసత కోసం పరీక్షను ఒకే షిఫ్ట్లో నిర్వహించడం అవసరం.. తద్వారా అభ్యర్థులందరికీ సమాన అవకాశం లభిస్తుందని అభిప్రాయపడింది.
నీట్-పీజీ 2025 పరీక్షను రెండు షిఫ్టుల్లో నిర్వహించాలన్న నోటిఫికేషన్ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని రెండు షిఫ్టుల విధానం అన్యాయాన్ని ప్రోత్సహిస్తోందన్నారు. పరీక్షల ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యం చేయరాదని, అన్ని ఏర్పాట్లు పారదర్శకంగా చేయాలని కోర్టు స్పష్టం చేసింది.