పోలీసు బలగాల ఆధునీకరణకు మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Modi government approves Rs 26,275 crore scheme for continuation of police modernisation. 26,275 కోట్ల ఆర్థిక వ్యయంతో 2025-26 వరకు ఐదేళ్లపాటు మెగా పోలీసు
By Medi Samrat
26,275 కోట్ల ఆర్థిక వ్యయంతో 2025-26 వరకు ఐదేళ్లపాటు మెగా పోలీసు ఆధునీకరణ పథకాన్ని కొనసాగించేందుకు మోదీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. జమ్మూ కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో కొత్త బెటాలియన్ల ఏర్పాటు, హైటెక్ ఫోరెన్సిక్ లేబొరేటరీలు, ఇతర పరిశోధనా సాధనాల కోసం భద్రతా సంబంధిత ఖర్చులు ఈ పథకంలో ఉన్నాయని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. పోలీసు బలగాల ఆధునీకరణ (ఎంపీఎఫ్) పథకాన్ని కొనసాగించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఆమోదం తెలిపిందని అధికారిక ప్రకటన తెలిపింది
2021-22 నుండి 2025-26 మధ్య కాలానికి సంబంధించిన ఈ ఆమోదం ద్వారా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీసు బలగాల ఆధునీకరణ పనితీరును మెరుగుపరచడానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా చొరవ యీసుకున్నారు. ఈ పథకం మొత్తం రూ. 26,275 కోట్ల కేంద్ర ఆర్థిక వ్యయంతో ఆధునీకరణ, మెరుగుదలకు దోహదపడే అన్ని సంబంధిత ఉప పథకాలను కలిగి ఉందని ప్రకటన పేర్కొంది. అంతర్గత భద్రత, శాంతిభద్రతలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీసులకు అందించడానికి ఈ పథకం తోడ్పడనుంది. దేశంలో బలమైన ఫోరెన్సిక్ సెటప్ను అభివృద్ధి చేయడం ద్వారా మాదకద్రవ్యాల నియంత్రణ, నేర న్యాయ వ్యవస్థను బలోపేతం చేయడం కోసం రాష్ట్రాలకు సహాయం అందించబడుతుంది.
జమ్మూ కశ్మీర్,ఈశాన్య రాష్ట్రాలు మరియు లెఫ్ట్ వింగ్ తీవ్రవాద (LWE) ప్రభావిత ప్రాంతాలలో భద్రతా సంబంధిత వ్యయం కోసం రూ. 18,839 కోట్ల కేంద్ర వ్యయం కేటాయించబడింది. రాష్ట్ర పోలీసు బలగాల ఆధునీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.4,846 ఇవ్వనుంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో శాస్త్రీయ, సమయానుకూల పరిశోధనకు సహాయపడటానికి కార్యాచరణ స్వతంత్ర అధిక-నాణ్యత ఫోరెన్సిక్ సైన్సెస్ సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి రూ. 2,080.50 కోట్లు ఇవ్వబడుతుంది.
మావోయిస్టులు, ఎల్డబ్ల్యుఇని ఎదుర్కోవడానికి 'నేషనల్ పాలసీ అండ్ యాక్షన్ ప్లాన్' అమలుతో, ఎల్డబ్ల్యుఇ హింసాత్మక సంఘటనలు బాగా తగ్గాయని ప్రభుత్వం పేర్కొంది. రూ. 8,689 కోట్ల కేంద్ర వ్యయంతో ఆరు LWE సంబంధిత పథకాలు ఆమోదించబడ్డాయి. ఇండియా రిజర్వ్ బెటాలియన్లు లేదా స్పెషలైజ్డ్ ఇండియా రిజర్వ్ బెటాలియన్ల పెంపుదల కోసం రూ. 350 కోట్ల కేంద్ర వ్యయం ఆమోదించబడింది. మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సహాయం అనే కేంద్ర పథకం కింద రూ.50 కోట్లు ఆమోదించినట్లు ప్రకటన పేర్కొంది.