ఉత్తరప్రదేశ్లోని మధుర జిల్లా బృందావన్ వద్ద యమునా నదిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒక పడవ బోల్తా పడిన ఘటనలో కనీసం 9 మంది మరణించగా, పలువురు నీటిలో గల్లంతయ్యారు. బృందావన్ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని శృంగార్ ఘాట్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో పడవలో సుమారు 25 మంది ఉన్నట్లు సమాచారం. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) బృందాలు, స్థానిక డైవర్లు (ఈతగాళ్లు) రంగంలోకి దిగి నదిలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ ప్రమాదం క్షణాల్లో జరిగిపోయిందని, తమను తాము కాపాడుకోవడానికి కూడా సమయం దొరకలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 9 మంది మరణించినట్లు జిల్లా కలెక్టర్ సీపీ సింగ్ ధృవీకరించారు. ప్రమాద స్థలం వద్ద భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. తమ వారి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ ఎదురుచూస్తున్నారు