ప్రధాని మోదీతో భేటీ అయిన పశ్చిమబెంగాల్ సీఎం దీదీ
Mamata Benarjee Meet With PM Modi. ప్రధాని నరేంద్ర మోదీతో మంగళవారం పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ భేటీ అయ్యారు
By Medi Samrat Published on 27 July 2021 1:40 PM GMT
ప్రధాని నరేంద్ర మోదీతో మంగళవారం పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ భేటీ అయ్యారు. ఢిల్లీలోని ప్రధాని మోదీ అధికారిక నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ఇరువురు పలు విషయాలు చర్చించారు. ఇటీవల బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మమత.. ఢిల్లీకి రావడం ఇదే తొలిసారి. భేటీ అనంతరం మమత మీడియాతో మాట్లాడుతూ.. మర్యాదపూర్వకంగానే ప్రధానితో సమావేశమయ్యానని చెప్పారు.
West Bengal CM @MamataOfficial called on PM @narendramodi. pic.twitter.com/KY8vEYmPwp
— PMO India (@PMOIndia) July 27, 2021
బెంగాల్ రాష్ట్రానికి మరిన్ని కరోనా వ్యాక్సిన్ డోసులు అవసరమని కోరానని తెలిపారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రం పేరు మార్పు అంశాన్ని లేవనెత్తానని.. పేరు మార్పు అంశాన్ని పరిశీలిస్తామని ప్రధాని అన్నారని తెలిపారు. దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన పెగాసస్ అంశంపై ప్రధాని అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తే బాగుంటుందని ఆమె చెప్పారు. ఈ కేసును సుప్రీంకోర్టు పర్యవేక్షించాలని అన్నారు. ఇదిలావుంటే.. మమత ఢిల్లీలో ఐదు రోజులు పర్యటించనున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో రేపు మమత భేటీ అవుతారు. టీఎంసీ ఎంపీలతో కూడా రేపు ఆమె సమావేశం కానున్నారు.