ప్రజాస్వామ్య వ్యవస్థలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారని ఇదే ధోరణి కొనసాగితే.. రాష్ట్రపతి పాలనకు దారి తీస్తుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ప్రజాస్వామ్యం, సమాఖ్య నిర్మాణాన్ని పరిరక్షించాలని ఆమె భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ)ని కోరారు. కోల్కతాలోని నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ జురిడికల్ సైన్సెస్ (ఎన్యుజెఎస్) స్నాతకోత్సవానికి హాజరైన సిజెఐ జస్టిస్ యుయు లలిత్ సమక్షంలో మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు. జస్టిస్ యుయు లలిత్ ఎన్యుజెఎస్ విశ్వవిద్యాలయం ఛాన్సలర్.
వేధింపుల నుండి ప్రజలను రక్షించాలని న్యాయవ్యవస్థను కోరారు. అధికారాన్ని ఒక నిర్దిష్ట వర్గం స్వాధీనం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. "ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది? దయచేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించండి" అని CJIతో అన్నారు. మీడియా పక్షపాతంపై బెంగాల్ ముఖ్యమంత్రి మండిపడ్డారు. తీర్పు వెలువడకముందే చాలా విషయాలు జరుగుతున్నాయని ఆమె అన్నారు. "నన్ను క్షమించండి. నేను తప్పు చేశానని మీరు భావిస్తే, నేను క్షమాపణలు కోరుతాను" అని ఆమె సీజేఐతో అన్నారు.
NUJS "ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన సంస్థలలో ఒకటి" అని ప్రశంసించారు. ప్రస్తుత CJI పోషించిన పాత్రను మెచ్చుకుంటూ.. "నేను జస్టిస్ UU లలిత్ను తప్పక అభినందించాలి. నేను ఈ ప్లాట్ఫారమ్ను ఉపయోగించవచ్చో నాకు తెలియదు. కానీ రెండు నెలల్లో ఆయన న్యాయవ్యవస్థ అంటే ఏమిటో చూపించారని అన్నారు. "ప్రజలు న్యాయవ్యవస్థపై విశ్వాసం కోల్పోయారని నేను అనడం లేదు, కానీ ఈ రోజుల్లో పరిస్థితి మరింత దిగజారింది. న్యాయవ్యవస్థ ప్రజలను అన్యాయం నుండి రక్షించాలి. వారి మొరలను వినాలి. ప్రస్తుతం.. ప్రజలు మూసిన తలుపుల వెనుక ఏడుస్తున్నారని వ్యాఖ్యానించారు.