బెంగాల్‌లో వక్ఫ్ సవరణ చట్టాన్ని అమలు చేయం : మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం సంచ‌ల‌న‌ ప్రకటన చేశారు.

By Medi Samrat
Published on : 9 April 2025 2:56 PM IST

బెంగాల్‌లో వక్ఫ్ సవరణ చట్టాన్ని అమలు చేయం : మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం సంచ‌ల‌న‌ ప్రకటన చేశారు. కేంద్రం తీసుకొచ్చిన‌ వక్ఫ్ సవరణ చట్టాన్ని పశ్చిమ బెంగాల్‌లో అమలు చేయడం లేదన్నారు. కోల్‌కతాలోని జైన్ కమ్యూనిటీ కార్యక్రమంలో బెనర్జీ మాట్లాడుతూ.. మైనారిటీ ప్రజలను, వారి ఆస్తులను నేను రక్షిస్తానని అన్నారు. వక్ఫ్ చట్టం అమలుపై మీరు అసంతృప్తిగా ఉన్నారని నాకు తెలుసు.. అయితే నన్ను నమ్మండి.. ఎవరైనా విభజించి పాలించాల‌నుకుంటే బెంగాల్‌లో అలా జరగదు.. బంగ్లాదేశ్ పరిస్థితిని చూడండి అని మమతా బెనర్జీ అన్నారు. వక్ఫ్ సవరణ బిల్లును ఆమోదించి ఉండాల్సింది కాదన్నారు.

వక్ఫ్ సవరణ బిల్లును గత గురువారం లోక్‌సభ ఆమోదించగా.. శుక్రవారం రాజ్యసభ ఆమోదించింది. శనివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బిల్లుకు ఆమోదం తెలిపారు. ఈ చట్టం వల్ల భూ సంబంధిత వివాదాలు తగ్గుముఖం పడతాయన్నది ప్రభుత్వ వాదన. వక్ఫ్ బోర్డు పని సమర్థవంతంగా, పారదర్శకంగా.. జవాబుదారీగా ఉంటుందని ప్ర‌భుత్వం చెబుతుంది.

మరోవైపు బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల సందర్భంగా హింస చెలరేగింది. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందని సీఎం మమతా బెనర్జీపై బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ముర్షిదాబాద్ జిల్లాలోని జంగీపూర్ ప్రాంతంలో హింస చెలరేగింది.

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి ఎక్స్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఇందులో కొందరు సంఘ వ్యతిరేక వ్యక్తులు ప్రజా ఆస్తులను తగలబెడుతున్నారని పేర్కొన్నారు. పోలీసు వాహనాలను తగులబెట్టే పనిలో నిమగ్నమై ఉన్నారు. నిరసనల పేరుతో అరాచకాలను ప్రచారం చేస్తున్నారు. బెంగాల్ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని సువేందు అధికారి ఆరోపించారు. సువేందు అధికారి ఈ ప్రాంతంలో కేంద్ర బలగాలను మోహరించాలని డిమాండ్‌ను లేవనెత్తారు.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Next Story