ఆ మహిళకు మరణశిక్ష.. చేసిన పాపమేమిటంటే..?

రెండున్నరేళ్ల బాలికను సజీవ సమాధి చేసి దారుణంగా హత్య చేసిన కేసులో పంజాబ్‌లోని లూథియానా కోర్టు గురువారం ఓ మహిళకు మరణశిక్ష విధించింది.

By Medi Samrat  Published on  18 April 2024 12:00 PM GMT
ఆ మహిళకు మరణశిక్ష.. చేసిన పాపమేమిటంటే..?

రెండున్నరేళ్ల బాలికను సజీవ సమాధి చేసి దారుణంగా హత్య చేసిన కేసులో పంజాబ్‌లోని లూథియానా కోర్టు గురువారం ఓ మహిళకు మరణశిక్ష విధించింది. సిమ్లాపురి ప్రాంతానికి చెందిన నీలమ్ అనే 35 ఏళ్ల మహిళ చిన్నారిని హత్య చేసింది. ఈ కేసులో గత వారం సెషన్స్ జడ్జి మునీష్ సింగల్ దోషిగా నిర్ధారించారు. నవంబర్ 28, 2021న చిన్నారిని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసిన ఆరోపణలపై కోర్టు ఆమెను దోషిగా తేల్చారు. నిందితురాలు చిన్నారిని సజీవంగా పాతిపెట్టడంతో.. పాపం చిన్నారి ఊపిరాడక చనిపోయింది. తాజాగా శిక్షను ఖరారు చేస్తూ తీర్పును ఇచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నీలమ్ 2021 నవంబర్ 28న సేలం తబ్రీ ప్రాంతంలో గోతిలో చిన్నారిని పూడ్చిపెట్టింది. చిన్నారి కుటుంబంతో పాత కక్షలే ఈ పనికి పాల్పడడానికి కారణమని తేలింది. కోర్టు ఆమెను దోషిగా నిర్ధారించగా.. ప్రాసిక్యూషన్ మరణశిక్ష కోసం డిమాండ్‌ చేసింది. నిందితురాలు చిన్నారిని తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. విచారణలో ఆమె హత్య చేసినట్లు ఒప్పుకుంది. పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం.. ఊపిరాడక చనిపోయే తీవ్రమైన నొప్పిని ఆ చిన్నారి భరించింది. నిందితురాలు చిన్నారిని గొయ్యిలో పూడ్చిపెట్టే ముందు రెండుసార్లు కొట్టినట్లు కూడా గుర్తించారు. తలపై రెండు గాయం గుర్తులు ఉన్నాయి. ఒకటి నుదిటిపై, మరొకటి తల వెనుక. ఇంతటి దారుణానికి పాల్పడిన నీలమ్ కు మరణ శిక్ష విధించాలని ధర్మాసనం అభిప్రాయపడింది.

Next Story