లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల.. తేదీలివే..!

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించింది. దీంతో పాటు దేశవ్యాప్తంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా అమల్లోకి వచ్చింది.

By Medi Samrat  Published on  16 March 2024 11:10 AM GMT
లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల.. తేదీలివే..!

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించింది. దీంతో పాటు దేశవ్యాప్తంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా అమల్లోకి వచ్చింది. ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏప్రిల్ 19 నుంచి ప్రారంభమయ్యే లోక్‌సభ ఎన్నికల్లో చివరి దశ ఓటింగ్ జూన్ 1న జరగనుంది. జూన్ 4న ఫలితాలు రానున్నాయి. ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాల్లో(ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఒడిషా, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌, సిక్కీం) అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను, ఖాళీగా ఉన్న ఉప ఎన్నికల స్థానాలకు ఎన్నికలను కూడా ప్రకటించింది.

మొదటి దశ ఓటింగ్ 19 ఏప్రిల్ 2024న జరుగుతుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ లోక్ సభ ఎన్నికల తేదీలను ప్రకటించారు. దీని ప్రకారం ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఎన్నికల ఫలితాలు రానున్నాయి.

తొలి దశలో 21 రాష్ట్రాల్లోని మొత్తం 102 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. రెండో దశలో 13 రాష్ట్రాల్లోని 89 స్థానాలకు, మూడో దశలో 12 రాష్ట్రాల్లోని 94 స్థానాలకు, నాలుగో ద‌శ‌లో 10 రాష్ట్రాల్లోని 96 స్థానాలకు, ఐద‌వ ద‌శ‌లో 8 రాష్ట్రాల్లోని 49 స్థానాలకు, ఆర‌వ ద‌శ‌లో 7 రాష్ట్రాల్లో 57 స్థానాలకు, ఏడ‌వ ద‌శ‌లో 8 రాష్ట్రాలలో 57 సీట్లకు పోలింగ్‌ జరగనుంది.

సార్వత్రిక ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. మే 13న ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న సిక్కిం, అరుణాచల్‌లో పోలింగ్. ఒడిశాలో మే 13 నుంచి 4 దశల్లో పోలింగ్ జరగనుంది. వీటితో పాటు హర్యానా, హిమాచల్, జార్ఖండ్, యూపీ సహా 26 అసెంబ్లీ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు జరగనున్నాయి.

దేశంలో 96.8 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, 10 లక్షలకు పైగా బూత్‌లలో ఓటింగ్‌ ఉంటుందని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. మన దేశ ఎన్నికలపై ప్రపంచం మొత్తం కన్ను పడుతుందని రాజీవ్ కుమార్ అన్నారు. ఈసారి 1.8 కోట్ల మంది ఓటర్లు తొలిసారిగా ఓటు వేయనున్నారని, మొత్తం 21.5 కోట్ల మంది యువత ఓటర్లు ఉంటారని తెలిపారు. పురుష ఓటర్ల సంఖ్య 49.7 కోట్లు కాగా మ‌హిళా ఓట‌ర్ల సంఖ్య 49.1 కోట్లు. మహిళా ఓటర్ల సంఖ్య పెరిగిందని ఎన్నికల కమిషనర్ తెలిపారు. ప్ర‌స్తుత లోక్‌సభ పదవీకాలం జూన్ 16 వరకు ఉంది. ఈసారి 85 ఏళ్లు పైబడిన ఓటర్లు ఇంటి నుంచే ఓటు వేయవచ్చు. చాలా ప్రాంతాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే ​​ఎక్కువగా ఉన్నారని వెల్ల‌డించారు.

Next Story