టెర్రర్.. వారం రోజుల్లో నలుగురు మనుషులను చంపేసిన పులి

Kodagu residents stay indoor as tiger continues to be elusive. కర్ణాటకలోని నాగర్ హోళ్ అటవీప్రాంతంలో ఓ పులి వారం రోజుల వ్యవధిలోనే

By Medi Samrat
Published on : 13 March 2021 6:59 PM IST

టెర్రర్.. వారం రోజుల్లో నలుగురు మనుషులను చంపేసిన పులి

కర్ణాటకలోని నాగర్ హోళ్ అటవీప్రాంతంలో ఓ పులి వారం రోజుల వ్యవధిలోనే తోటల్లో పనిచేసే నలుగురు కార్మికులను, 16 పశువులు, పెంపుడు జంతువులను చంపేసింది. దీంతో ఆ ప్రాంతంలోని వారంతా ఎంతగానో భయబ్రాంతులకు గురవుతూ ఉన్నారు. ఇక ఫారెస్ట్ అధికారులకు కూడా ఆ పులిని పట్టుకోవడం ఓ సవాలుగా మారింది. దాంతో ప్రభుత్వం ఆ పులిపై షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ జారీ చేసింది. ఎనిమిదేళ్ల బాలుడ్ని చంపడంతో కొడగు జిల్లాలో ప్రజలు భయపడుతూ ఉన్నారు. ఆ పులిని వెంటనే హతమార్చాలంటూ అధికారులను డిమాండ్ చేసిన ప్రజలు... అధికారులు చంపకపోతే తామే అడవిలోకి వెళ్లి ఆ పులిని చంపేస్తామని అన్నారు. కొడగు రక్షణ వేదికతో పాటు పలు ఎన్జీవో సంఘాలు పులి బారి నుంచి ప్రజలను కాపాడాలంటూ భారీ ప్రదర్శన నిర్వహించాయి. ఓవైపు పులి దాడులు, మరోవైపు ప్రజల నిరసనలతో అటవీశాఖ అధికారులు తీవ్ర సందిగ్ధంలో ఉన్నారు. ఎలాగైనా పులిని మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వం కూడా కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో పులి వేట ముమ్మరంగా జరుగుతోంది.

ఈ పులి చంపినా వారిలో 12, 14 ఏళ్ల పిల్లలు కూడా ఉన్నారు. పులిని పట్టుకోడానికి 150 మందితో కూంబింగ్ ఆపరేషన్ ను కూడా మొదలుపెట్టారు అధికారులు. ఆ ప్రాంతంలోని వాళ్లంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. తమకు పులి ఏమి చేస్తోందో అనే భయం పట్టి పీడిస్తోందని ఆ ప్రాంత వాసులు చెప్పుకొచ్చారు. బయటకు రావాలన్నా, ఏవైనా పనులు చేసుకోవాలనుకున్నా చాలా కష్టంగా ఉందని తెలిపారు. ఒక పులి కాదని.. తమ ప్రాంతంలో ఇంకా ఎక్కువ పులులే తిరుగుతున్నాయని కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. వీలైనంత తొందరగా ఆ పులి బాధ నుండి తమను విముక్తుల్ని చేయాలని కోరుతూ ఉన్నారు.


Next Story