కర్ణాటక శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎస్ఎల్ ధర్మేగౌడ ఆత్మహత్య చేసుకున్నారు. చిక్మగళూరు వద్ద రైల్వే ట్రాక్ పక్కన ధర్మేగౌడ మృతదేహం లభ్యమైంది. ఘటనా స్థలిలో సూసైడ్ నోట్ కూడా ఉంది. తొలుత మృతదేహంపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించగా.. అది ధర్మేగౌడ అని తేల్చారు. ఆయన పక్కనే ఒక సూసైడ్ లెటర్ లభించడంతో ఆత్మహత్య అని నిర్ధారించారు.
ఇదిలావుంటే.. ఈనెల 15న కర్ణాటక శాసనమండలిలో హైడ్రామా చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ సభ్యులు ధర్మేగౌడను సీటులో నుంచి లాగేశారు. సభాధ్యక్ష కుర్చీ చుట్టూ రక్షణ వలయంగా నిలబడ్డారు. ఓ కాంగ్రెస్ సభ్యుడు ఆ కుర్చీలో కూర్చున్నాడు. దాంతో ఆ కుర్చీని స్వాధీనం చేసుకొనేందుకు బీజేపీ, జేడీఎస్ సభ్యులు ప్రయత్నించటంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. అడ్డువచ్చిన మార్షల్స్పైనా పిడిగుద్దులు కురిపించారు.
ఈ ఘటనతో డిప్యూటీ చైర్మన్ ధర్మేగౌడ తీవ్ర మనస్తానికి గురయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ధర్మేగౌడ సోమవారం సాయంత్రం ఒంటరిగా కారులో వెళ్లారు. తెల్లారేసరికి విగత జీవిలా మారారు. కాగా, జేడీఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన ధర్మేగౌడ.. శాసనమండలి డిప్యూటీ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ధర్మేగౌడ మృతిపై రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతి కర్ణాటకకు తీరని లోటు అని పేర్కొన్నారు.