హిజాబ్‌పై తీర్పు వెలువరించిన న్యాయమూర్తులకు 'వై' కేటగిరీ భద్రత

Karnataka govt provides 'Y' category security to judges who gave verdict on hijab row

By Medi Samrat  Published on  20 March 2022 10:07 AM GMT
హిజాబ్‌పై తీర్పు వెలువరించిన న్యాయమూర్తులకు వై కేటగిరీ భద్రత

హిజాబ్ వివాదంపై తీర్పు వెలువరించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సహా ముగ్గురు న్యాయమూర్తులకు 'వై' కేటగిరీ భద్రత కల్పిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఆదివారం నిర్ణయం తీసుకుంది. మదురైలో గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు న్యాయమూర్తులను చంపుతామని బెదిరింపు ప్రకటనలు చేసిన నేపథ్యంలో ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఈ విష‌య‌మై బెంగళూరులో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఈ ఘటనను ఖండించకపోవడంతో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు.

ఘటన జరిగి 3-4 రోజులైనా "ఫేక్ సెక్యులర్" లాబీ ఎందుకు మౌనంగా ఉంది.. తీర్పును చూసి జడ్జిలను చంపేస్తామని బెదిరిస్తున్నారు. అందరూ మౌనంగా ఉన్న‌ది.. సెక్షన్‌ను శాంతింపజేయడానికేనా.? అది సెక్యులరిజం కాదు.. ఇది మతతత్వం.. నేను దీనిని ఖండిస్తున్నాను.. మౌనం వీడి అంద‌రూ ఐక్యంగా ఉండాలని సీఎం అన్నారు. దర్యాప్తును పరిశీలించి.. నిందితులను కస్టడీకి తీసుకునేందుకు తమిళనాడు పోలీసుల‌తో సమన్వయం చేసుకోవాలని రాష్ట్ర డీజీపీని సీఎం కోరారు. ప్రైవేట్ వ్య‌క్తుల ఫిర్యాదుల ఆధారంగా నిందితులపై కేసు నమోదు చేశారు.

అంతకుముందు హిజాబ్ వివాదంపై తీర్పు వెలువ‌డిన నేప‌థ్యంలో కర్ణాటక హైకోర్టున్యాయమూర్తులపై కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకు ముగ్గురు తమిళనాడు తౌహీద్ జమాత్ కార్యకర్తలపై కేసు నమోదైంది. మదురైలోని కొరిపాళయం ప్రాంతంలో ఇటీవల జరిగిన బహిరంగ సభలో వారు అభ్యంత‌ర‌క‌ర‌మైన‌ వ్యాఖ్యలు చేశారు.












Next Story