'మీ చుట్టూ ఉన్న మూర్ఖులతో జాగ్రత్త'.. హనీమూన్ మర్డర్పై కంగనా సీరియస్ కామెంట్స్
మేఘాలయలో హనీమూన్కు వెళ్లిన ఇండోర్ వాసి రాజా రఘువంశీ హత్య కేసు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.
By Medi Samrat
మేఘాలయలో హనీమూన్కు వెళ్లిన ఇండోర్ వాసి రాజా రఘువంశీ హత్య కేసు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. తన భర్తను హత్య చేసేందుకు అతని భార్య సోనమ్ రఘువంశీ కాంట్రాక్ట్ ఇచ్చిందని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై కంగనా రనౌత్ స్పందించింది.
కంగనా రనౌత్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్ను పంచుకుంది. రాజా రఘువంశీ హత్య కేసును తాను అర్థం చేసుకోలేకపోతున్నాను.. ఇది నన్ను కదిలించింది.. ఇది చాలా అసంబద్ధం.. స్త్రీ తన తల్లిదండ్రులకు భయపడి వివాహాన్ని తిరస్కరించదు.. కానీ ఆమె కాంట్రాక్ట్ కిల్లర్తో క్రూరమైన హత్యకు ప్లాన్ చేస్తుంది. ఉదయం నుంచి ఈ విషయం నా మనసులో మెదులుతోంది.. కానీ అర్థం కావడం లేదు.. అయ్యో, ఇప్పుడు నాకు తలనొప్పిగా ఉంది. ఆమె విడాకులు తీసుకోలేదు.. తన ప్రేమికుడితో పారిపోలేదు. ఎంత క్రూరమైనది, హేయమైనది, అన్నింటికంటే అసంబద్ధం, మూర్ఖత్వం. తెలివితక్కువ వ్యక్తులను ఎప్పుడూ తేలికగా తీసుకోకూడదు. వారు సమాజానికి అతిపెద్ద ముప్పు. మనం తరచుగా వారిని చూసి నవ్వుతాము. వారు ప్రమాదకరం కాదని అనుకుంటాము.. కానీ అది నిజం కాదు. మేధావులు తమ స్వలాభం కోసం ఇతరులకు హాని కలిగించవచ్చు కానీ ఒక మూర్ఖుడికి అతను ఏమి చేస్తున్నాడో తెలియదు.. గుర్తుంచుకోండి.. మీ చుట్టూ ఉన్న మూర్ఖుల నుంచి జాగ్రత్తగా ఉండండి అని కంగనా అన్నారు.
మే నెలలో ఇండోర్లో నివాసముంటున్న రాజా, సోనమ్లు పెళ్లి తర్వాత హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లి అక్కడి నుంచి కనిపించకుండా పోయారు. తరువాత రాజా మృతదేహం షిల్లాంగ్లో కనపడింది. సోనమ్ కనిపించకుండా పోయింది. కొన్ని రోజుల తర్వాత సోనమ్ రఘువంశీ ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లో దొరికింది. మేఘాలయ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తన భర్త రాజా హత్యలో సోనమ్ రఘువంశీ ప్రధాన కుట్రదారు. రాజ్ కుష్వాహ అనే వ్యక్తితో సోనమ్కు సంబంధం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఆమె తన ప్రేమికుడితో పాటు మరికొందరు సహచరులతో కలిసి రాజాను అడ్డు తప్పించాలని ప్లాన్ చేసింది.