Video : పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత పాక్‌ రాయబార కార్యాలయానికి కేక్ డెలివరీ చేసిన వ్యక్తికి, జ్యోతి మల్హోత్రాకు కనెక్షన్.?

ఆపరేషన్ సిందూర్ తర్వాత దేశంలోని 3 రాష్ట్రాల నుంచి 8 మందిని అదుపులోకి తీసుకున్నారు.

By Medi Samrat
Published on : 20 May 2025 10:24 AM IST

Video : పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత పాక్‌ రాయబార కార్యాలయానికి కేక్ డెలివరీ చేసిన వ్యక్తికి, జ్యోతి మల్హోత్రాకు కనెక్షన్.?

ఆపరేషన్ సిందూర్ తర్వాత దేశంలోని 3 రాష్ట్రాల నుంచి 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా పాకిస్థాన్ గూఢచర్యానికి పాల్పడ్డారని ఆరోపించారు. అయితే, ఈ వ్యక్తులందరిలో, ఎక్కువగా చర్చించబడే ఒక పేరు యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా. పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐతో జ్యోతికి సంబంధాలున్నట్లు ఆరోపణలు వచ్చాయి. జ్యోతి మల్హోత్రా తన యూట్యూబ్ ఛానెల్‌ని 'ట్రావెల్ విత్ JO' పేరుతో నడుపుతోంది. జ్యోతి అనేక సార్లు పాకిస్తాన్‌ను కూడా సందర్శించింది.. అందుకు సంబంధించిన‌ వీడియోలు ఆమె యూట్యూబ్ ఛానెల్‌లో అందుబాటులో ఉన్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పాకిస్తాన్‌కు అనుకూలంగా కథనాన్ని సెట్ చేయడానికి ISI జ్యోతిని ఉపయోగించుకుంది. అయితే హర్యానాలోని హిసార్‌లో నివసించే జ్యోతికి పాకిస్థాన్ గూఢచార సంస్థతో ఎలా పరిచయం ఏర్పడిందనేది ప్రశ్న.

2023 సంవత్సరంలో జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్‌కి వీసా పొందడానికి న్యూఢిల్లీలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయానికి వెళ్లింది. ఈ సందర్భంగా ఆమె పాకిస్థాన్ హైకమిషన్ చీఫ్ ఎహసాన్ ఉర్ రెహ్మాన్ అలియాస్ డానిష్‌ను కలిసింది. డానిష్, జ్యోతి మొదటి సమావేశంలో స్నేహితులయ్యారు. ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకోవడం మొదలెట్టారు. క్రమంగా వారి మధ్య సాన్నిహిత్యం పెరిగింది.

ఎన్‌డిటివి కథనం ప్రకారం.. జ్యోతి పోలీసులతో మాట్లాడుతూ, “పాకిస్తాన్‌లో తన బస, ప్రయాణానికి సంబంధించిన మొత్తం ఏర్పాట్లు డానిష్ సహచరుడు అలీ అహ్వాన్ చేసాడు. జ్యోతిని పాక్ సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ అధికారులకు అలీ పరిచయం చేశాడు.’’ వీరిలో షకీర్, రానా షహబాజ్ పేర్లు తెరపైకి వచ్చాయి. జ్యోతిపై ఎవరికీ అనుమానం రాకుండా ‘జాట్ రంధావా’ పేరుతో షకీర్ మొబైల్ నంబర్‌ను జ్యోతి తన ఫోన్‌లో సేవ్ చేసుకుంది.

జ్యోతి పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారులతో కమ్యూనికేట్ చేయడానికి ఆమె సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించింది. సాధారణంగా ఆమె వాట్సాప్, స్నాప్‌చాట్, టెలిగ్రామ్ వంటి యాప్‌ల ద్వారా పాకిస్తాన్ అధికారులను సంప్రదించి వారికి అవసరమైన సమాచారాన్ని అందజేస్తుంది.

న్యూఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయంలో జ్యోతి కలిసిన డానిష్‌ను భారత ప్రభుత్వం దేశం నుండి బహిష్కరించింది. పాక్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ కోసం పని చేస్తున్నాడని, పాకిస్థాన్‌కు చాలా సున్నితమైన సమాచారాన్ని అందించాడని డానిష్‌పై ఆరోపణలు ఉన్నాయి. కాల్పుల విరమణ తర్వాత మే 13న భారత ప్రభుత్వం డానిష్‌ను పాకిస్తాన్‌కు తిరిగి వెళ్లాల‌ని ఆదేశించింది.

డానిష్‌తో పరిచయం ఏర్పడిన తర్వాత జ్యోతి చాలాసార్లు పాకిస్తాన్ రాయబార కార్యాలయాన్ని సందర్శించింది. ఆమెకు అనేక పార్టీలకు కూడా ఆహ్వానం అందింది. జ్యోతి యూట్యూబ్ ఛానెల్‌లో ఆ వ్లాగ్‌లను చూడవచ్చు. అదే సమయంలో ఇప్పుడు జ్యోతి యొక్క మరొక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఆమె ఒక వ్యక్తితో కనిపిస్తుంది. ఈ వ్యక్తి మరెవరో కాదు.. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్ రాయబార కార్యాలయానికి కేక్ డెలివరీ చేసిన వ్యక్తి,.. అతని వీడియో కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్థానీ రాయబార కార్యాలయం వెలుపలి నుండి ఒక వీడియో బహిర్గతమైంది, అందులో ఒక వ్యక్తి చేతిలో కేక్‌తో రాయబార కార్యాలయం వైపు వేగంగా వెళ్తున్నాడు. ఈ వ్యక్తి గతంలో కూడా పార్టీలలో జ్యోతితో కలిసి కనిపించాడు. దీనికి జ్యోతికి సంబంధం ఏమిటి? ఈ ప్రశ్నలన్నింటికీ భారతీయ ఏజెన్సీలు సమాధానాలు వెతుకుతున్నాయి.

Next Story