'26 మంది ప్రాణాల కంటే.. భారత్-పాక్ మ్యాచ్ ద్వారా వ‌చ్చే డబ్బు విలువైనదా?' : ఒవైసీ

ఆసియా కప్‌లో భాగంగా నేడు భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌పై భారత్‌ మాత్రమే కాదు యావత్ ప్రపంచం దృష్టి ఉంది.

By -  Medi Samrat
Published on : 14 Sept 2025 2:39 PM IST

26 మంది ప్రాణాల కంటే.. భారత్-పాక్ మ్యాచ్ ద్వారా వ‌చ్చే డబ్బు విలువైనదా? : ఒవైసీ

ఆసియా కప్‌లో భాగంగా నేడు భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌పై భారత్‌ మాత్రమే కాదు యావత్ ప్రపంచం దృష్టి ఉంది. కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్‌కు సంబంధించి రాజకీయ రగడ జోరందుకుంది. భారత్‌-పాకిస్థాన్‌ మధ్య జరుగుతున్న మ్యాచ్‌పై కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ టార్గెట్‌ చేశారు. పహల్గామ్‌లో మరణించిన 26 మంది ప్రాణాల కంటే ఈ మ్యాచ్ వల్ల వచ్చే ఆర్థిక ప్రయోజనాలు ముఖ్యమా అని ఒవైసీ ప్రశ్నించారు.

అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, మీ అందరికీ నా ప్రశ్న.. పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచ్‌లు ఆడటానికి నిరాకరించే అధికారం మీకు లేదా అని ఒవైసీ అడిగారు. జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిలో చనిపోయిన 26 మంది పౌరుల ప్రాణాల కంటే ఈ మ్యాచ్‌లో సంపాదించిన డబ్బు విలువైనదా అని ఒవైసీ ప్రశ్నించారు.

రక్తం, నీరు కలిసి ప్రవహించలేవని, చర్చలు, ఉగ్రవాదం కలిసి పోవని మీరు అన్న‌ప్పుడు.. బీసీసీఐకి క్రికెట్‌ మ్యాచ్‌ ద్వారా ఎంత డబ్బు వస్తుందని ప్రధానిని అడుగుతున్నాం.. రూ.2000 కోట్లు, రూ.3000 కోట్లు? మన 26 మంది పౌరుల ప్రాణాల కంటే ఆ డబ్బు విలువ గొప్పదా? మేము నిన్న కూడా ఆ 26 మంది పౌరుల కుటుంబాల‌కు అండగా ఉన్నామని, ఈ రోజు కూడా వారితోనే ఉన్నామని, రేపు కూడా వారితోనే నిలుస్తామని ఏఐఎంఐఎం అధినేత ఒవైసీ అన్నారు.

నేటి మ్యాచ్‌ను బహిష్కరించాలని పలువురు విపక్ష నేతలు సమర్ధించారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ దత్ ఈ మ్యాచ్‌లో భారత్ పాల్గొనడాన్ని విమర్శించారు. మ్యాచ్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

‘ఉగ్రవాదంతో చర్చలు వద్దు’ అనే ప్రభుత్వ వైఖరికి విరుద్ధంగా.. మ్యాచ్‌ ఆడాలని ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు. ఏఎన్‌ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. మీరు ఒక‌వైపు ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుతున్నారు.. మరోవైపు పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు.? అని ప్ర‌శ్నించారు

Next Story