పరిహారం ప్రకటించిన‌ ఇండిగో..!

డిసెంబర్ ప్రారంభంలో దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో విమానాలు ఒకదాని తరువాత ఒకటి రద్దు చేయబడ్డాయి.

By -  Medi Samrat
Published on : 11 Dec 2025 3:45 PM IST

పరిహారం ప్రకటించిన‌ ఇండిగో..!

డిసెంబర్ ప్రారంభంలో దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో విమానాలు ఒకదాని తరువాత ఒకటి రద్దు చేయబడ్డాయి. దీని కారణంగా ప్రయాణీకుల నుంచి తీవ్ర‌ నిరసన వ్యక్తమైంది. విమానయాన రంగంలో ఇంత పెద్ద సంక్షోభం గతంలో చాలా అరుదుగా కనిపించింది. భారీ సంఖ్యలో విమానాలను రద్దు చేయడంతో లక్షలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమయంలో ప్రయాణికులు చాలా గంటలపాటు విమానాశ్రయాల‌ వద్ద వేచి ఉన్నారు. పలు విమానాశ్రయాల్లో సూట్‌కేసుల గుట్టలు కనిపించాయి. ఇప్పుడు పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోంది. ఇంతలో.. ఇండిగో డిసెంబర్ 3/4/5 న ప్రభావితమైన ప్రయాణీకుల కోసం ప్రత్యేక ప్రకటన చేసింది.

ఇండిగో సంస్థ పరిహారం ప్రకటించింది. ఇండిగో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఈ సమాచారాన్ని ఇచ్చింది. డిసెంబరు 3/4/5న ప్రయాణిస్తున్న మా కస్టమర్‌లలో కొందరు కొన్ని విమానాశ్రయాలలో కొన్ని గంటలపాటు చిక్కుకుపోయారని.. రద్దీ కారణంగా వారిలో చాలా మంది తీవ్రంగా ప్రభావితమయ్యారని ఇండిగో తెలియజేసింది. అలా తీవ్రంగా ప్రభావితమైన కస్టమర్‌లకు మేము ₹10,000 విలువైన ట్రావెల్ వోచర్‌లను అందజేస్తాము. ఈ ట్రావెల్ వోచర్‌లను రాబోయే 12 నెలల్లో ఏదైనా ఇండిగో ప్రయాణం కోసం ఉపయోగించవచ్చు. ఈ పరిహారం ప్రస్తుత ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కట్టుబాట్లకు అదనం అని ప్రకటనలో పేర్కొంది. దీని ప్రకారం.. బయలుదేరే సమయం నుండి 24 గంటలలోపు విమానాలు రద్దు చేయబడిన ప్రయాణీకులకు ఇండిగో ఫ్లైట్ బ్లాక్ సమయాన్ని బట్టి ₹ 5,000 నుండి ₹ 10,000 వరకు పరిహారం ఇస్తుంది.

అదే సమయంలో విమానాలు రద్దు చేయబడిన ప్రయాణీకుల వాపసు గురించి కూడా ఇండిగో అప్‌డేట్‌ కూడా ఇచ్చింది. కార్యకలాపాలలో అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో రద్దు చేసిన విమానాలకు అవసరమైన అన్ని రీఫండ్‌లు ప్రారంభమయ్యాయని మేము నిర్ధారించుకున్నామని ఇండిగో తెలిపింది. వీటిలో ఇప్పటికే చాలా వరకు ప్రయాణికుల ఖాతాల్లో జమకాగా, మిగిలినవి త్వరలోనే ఖాతాల్లోకి జమ కానున్నాయని వెల్ల‌డించింది.

Next Story