శిశువుల కోసం 'బేబీ బెర్త్'.. ఎటువంటి ఛార్జీలు లేవు..

Indian Railways launch ‘Baby Berth’ for infants. భారతీయ రైల్వేలు ఫిబ్రవరి 8న మదర్స్ డే సందర్భంగా రైళ్లలో ప్రత్యేక ‘బేబీ బెర్త్’

By Medi Samrat
Published on : 10 May 2022 4:14 PM IST

శిశువుల కోసం బేబీ బెర్త్.. ఎటువంటి ఛార్జీలు లేవు..

భారతీయ రైల్వేలు ఫిబ్రవరి 8న మదర్స్ డే సందర్భంగా రైళ్లలో ప్రత్యేక 'బేబీ బెర్త్' (కొత్తగా జన్మించిన పిల్లలకు సీట్లు)ను ప్రవేశపెట్టింది. దీంతో శిశువులు ఇప్పుడు వారి తల్లితో పాటు పడుకోవచ్చు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రయాణించేందుకు వీలుగా ఇప్పటికే మహిళలకు కేటాయించిన లోయర్ బెర్త్‌లను ఆనుకునే బేబీ బెర్త్‌లను పక్కనే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం చిన్న పిల్లల కోసం ఈ కొత్త బెర్త్‌లను కొన్ని రైళ్లలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. అధికారిక సమాచారం ప్రకారం.. లక్నో నుండి న్యూఢిల్లీకి వెళ్లే లక్నో మెయిల్‌లో రెండు బెర్త్‌లు జోడించబడ్డాయి. శిశువులకు ఉద్దేశించిన సీటుకు రైల్వే ఎటువంటి అదనపు ఛార్జీలను వసూలు చేయదు.

ఈ కొత్త సదుపాయాన్ని ప్రవేశపెట్టిన తర్వాత, పాలు తాగే శిశువుతో ప్రయాణించే మహిళలు సుఖంగా ఉంటారని రైల్వే శాఖ ట్వీట్ చేసింది. లక్నో మెయిల్‌లోని త్రీ-టైర్ ఏసీ కోచ్‌లో రెండు బెర్త్‌లతో పాటు బేబీ బెర్త్‌ను ప్రవేశపెట్టినట్లు రైల్వేస్ ఒక ట్వీట్‌లో 'బేబీ బర్త్' ఫోటోను కూడా షేర్ చేసింది.

త్వరలో.. బేబీ బెర్త్ సౌకర్యాన్ని ఇతర రైళ్లకు కూడా విస్తరింపజేయనున్నారు. ఒంటరిగా ప్రయాణించే మహిళలు, గర్భిణీ స్త్రీలు, ఐదేళ్లలోపు పిల్లలతో ప్రయాణించే మహిళలకు లోయర్ బెర్త్‌లను అందించడానికి రైల్వేలు ప్రయత్నాలు చేస్తున్నాయి. రైలులో రిజర్వ్ చేయబడిన బెర్త్‌ల వెడల్పు తక్కువగా ఉండటంతో చిన్న పిల్లలతో మహిళలు ప్రయాణించడం కష్టంగా మారింది. అందుకోసం లోయర్ బెర్త్‌తో పాటు పిల్లల సీటు కూడా మహిళలకు కేటాయించేలా ఏర్పాట్లు చేశారు. సీటుపై నుంచి చిన్నారి కిందపడకుండా రైల్వేశాఖ తగిన జాగ్రత్తలు తీసుకుంది. రిజర్వేషన్ టిక్కెట్‌ను బుక్ చేసుకునే సమయంలో, ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల పేరును తప్పనిసరిగా పూరించాలి. మహిళలకు బేబీ బెర్త్ అందుబాటులో ఉంచబడుతుంది.














Next Story