'ఇండియా' లేదా 'భారత్'.. రాజ్యాంగం ఏం చెబుతోంది?

భారత రాష్ట్రపతి నుండి G20 విందు ఆహ్వాన పత్రికలో దేశం పేరును 'ఇండియా' నుండి 'భారత్'గా అధికారికంగా మార్చడంపై రాజకీయ వివాదానికి దారితీసింది.

By అంజి  Published on  6 Sep 2023 1:30 AM GMT
India, Bharat, Constitution, National news

'ఇండియా' లేదా 'భారత్'.. రాజ్యాంగం ఏం చెబుతోంది?

భారత రాష్ట్రపతి నుండి G20 విందు ఆహ్వాన పత్రికలో దేశం పేరును 'ఇండియా' నుండి 'భారత్'గా అధికారికంగా మార్చడంపై రాజకీయ వివాదానికి దారితీసింది. ఆహ్వాన పత్రికలో ద్రౌపది ముర్ముని 'ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా' అని కాకుండా 'ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్' అని పేర్కొన్నారు. ఇది దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీల నాయకుల నుంచి ప్రశ్నలు లేవనెత్తేలా చేసింది.

అయితే దీని గురించి రాజ్యాంగం, సుప్రీంకోర్టు ఏమి చెబుతున్నాయి?

రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 "ఇండియా అంటే భారత్ అని, అది రాష్ట్రాల యూనియన్‌గా ఉండాలి" అని పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 'ఇండియా', 'భారత్' రెండింటినీ దేశానికి అధికారిక పేర్లుగా గుర్తిస్తుందని నొక్కి చెప్పడం చాలా ముఖ్యం.

'ఇండియాను'ను తొలగించి 'భారత్‌' అనే ఏకైక అధికారిక పేరుగా రాజ్యాంగాన్ని సవరించాలని కేంద్రం యోచిస్తోందా?

సుప్రీం కోర్టు ఏం చెప్పింది

మార్చి 2016లో ఈ పిటిషన్‌పై తీవ్ర అభ్యంతరం తెలుపుతూ 'ఇండియా' నుండి 'భారత్'గా పేరు మార్చాలని కోరుతూ దాఖలైన PIL (ప్రజా ప్రయోజన వ్యాజ్యం)ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీఎస్‌ ఠాకూర్‌, జస్టిస్‌ యూయూ లలిత్‌లతో కూడిన ధర్మాసనం అలాంటి పిటిషన్లను విచారించబోమని పిటిషనర్‌కు తెలిపింది.

“భారత్ లేదా ఇండియా? మీరు దీన్ని భారత్ అని పిలవాలనిపిస్తే అలాగే పిలవండి. ఎవరైనా దీన్ని ఇండియా అని పిలవాలనుకుంటే.. వారు దానిని ఇండియా అని పిలుస్తారు" అని జస్టిస్ ఠాకూర్ ఆ సమయంలో అన్నారు. నాలుగు సంవత్సరాల తరువాత 2020లో ఇండియా నుండి భారత్‌గా పేరు మార్చాలని కోరుతూ ఇదే విధమైన అభ్యర్థనను స్వీకరించడానికి సుప్రీంకోర్టు మరోసారి నిరాకరించింది. న్యాయస్థానం ఆ సమయంలో, పిటిషన్‌ను ప్రాతినిధ్యంగా మార్చవచ్చని, తగిన నిర్ణయం కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపవచ్చని సూచించింది. “భారత్, ఇండియా రెండూ రాజ్యాంగంలో ఇవ్వబడిన పేర్లు. రాజ్యాంగంలో ఇండియాని ఇప్పటికే 'భారత్' అని పిలుస్తారు” అని భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఎ బాబ్డే పేర్కొన్నారు.

రాజ్యాంగాన్ని ఎలా సవరించవచ్చు?

ఒకవేళ 'భారత్‌' అనే పేరును మాత్రమే అధికారికంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించుకుంటే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 1ని సవరించే బిల్లును ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఆర్టికల్ 368 సాధారణ మెజారిటీ సవరణ లేదా ప్రత్యేక మెజారిటీ సవరణ ద్వారా రాజ్యాంగాన్ని సవరించడానికి అనుమతిస్తుంది. కొత్త రాష్ట్ర ప్రవేశం లేదా రాజ్యసభలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సీట్ల కేటాయింపు వంటి రాజ్యాంగంలోని కొన్ని ఆర్టికల్‌లు, హాజరైన మొత్తం సభ్యుల సంఖ్యలో సాధారణ మెజారిటీ (అంటే 50 శాతం కంటే ఎక్కువ) ద్వారా మార్చబడవచ్చు. ఆర్టికల్ 1కి ఏదైనా మార్పుతో సహా రాజ్యాంగంలో ఇతర మార్పుల కోసం, ఆ సభలో హాజరైన, ఓటింగ్‌లో ఉన్న సభ్యులలో మూడింట రెండు వంతుల కంటే తక్కువ కాకుండా ప్రత్యేక మెజారిటీ (66 శాతం) అవసరం.

Next Story