గొడ్డు మాంసం తింటాను అని ముందే చెప్పా.. మీకు చెప్పే ధైర్యముందా.? : మాజీ సీఎం
I eat cattle meat says Siddaramaiah. కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో
By Medi Samrat Published on 30 Dec 2020 6:53 AM GMT
కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో ఇటీవల జరుగుతున్న పరిణామాలపై స్పందించడంలో కాంగ్రెస్ నాయకులు విఫలమయ్యారని, కాంగ్రెస్ నాయకులు ధైర్యం చూపించలేకపోతున్నారని అన్నారు. తాను గొడ్డుమాంసం తింటానని గతంలో చెప్పానని, ఇప్పుడు కూడా అదే మాట ధైర్యంగా చెప్పగలనని, నా అంత ధైర్యంగా మీరు చెప్పగలరా? అంటూ సహచర కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు.
"గతంలో నేను ఇదే విషయాన్ని అసెంబ్లీలో చెప్పాను. బీఫ్ తింటాను, అడగడానికి మీరెవరని గద్దించాను. ఏం తినాలనేది నా హక్కు, ప్రశ్నించే అధికారం మీకెక్కడిదని నిలదీశాను. మీకిష్టం లేకపోతే తినొద్దు, నాకు ఇష్టం కాబట్టే తింటున్నాను... ఈ విధంగా మీరు చెప్పగలరా?" అని సిద్ధరామయ్య కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో చాలామంది నేతలు ఏ విషయంపై ఎవరు మాట్లాడుతారోనని భయపడి పలు అంశాలపై మాట్లాడడంలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కనీసం తమ వైఖరి కూడా చెప్పలేకపోతున్నారని ఆరోపించారు. తమ మౌనం ద్వారా ఇతరులు మాట్లాడుతున్నదే సరైనది అనే భావన కలుగజేస్తున్నారని అన్నారు. వీలైనంత త్వరగా ఈ గందరగోళ పరిస్థితుల నుంచి బయటికి రావాలని సిద్ధరామయ్య స్పష్టం చేశారు.