వారంలో వందకుపైగా విమానాలకు బెదిరింపు కాల్స్‌.. సీరియ‌స్ యాక్ష‌న్‌కు సిద్ధ‌మైన ప్రభుత్వం

గత వారం రోజుల్లో దాదాపు 100 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇవన్నీ నకిలీవి.. విమానం ప్ర‌యాణాల్లో గణనీయమైన జాప్యానికి కారణమయ్యాయి

By Medi Samrat  Published on  21 Oct 2024 9:34 AM GMT
వారంలో వందకుపైగా విమానాలకు బెదిరింపు కాల్స్‌.. సీరియ‌స్ యాక్ష‌న్‌కు సిద్ధ‌మైన ప్రభుత్వం

గత వారం రోజుల్లో దాదాపు 100 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇవన్నీ నకిలీవి.. విమానం ప్ర‌యాణాల్లో గణనీయమైన జాప్యానికి కారణమయ్యాయి. ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ప్రయాణీకుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంద‌ని పేర్కొంది. అయితే ఇలాంటి ఫేక్ కాల్స్ చేసి భయాందోళనలు సృష్టించే వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఇందుకోసం నిబంధనలలో కూడా అవసరమైన మార్పులు చేయనుంది.

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు మాట్లాడుతూ.. 'ఈ బెదిరింపులు అబద్ధమని నిరూపించబడినప్పటికీ.. మా శాఖ, విమానయాన సంస్థలు కఠినమైన ప్రోటోకాల్‌లను అనుసరిస్తాయి. ఇలాంటి బెదిరింపుల వల్ల విషయం చాలా సున్నితంగా మారుతుంది. అప్పుడు మనం అనుసరించాల్సిన అంతర్జాతీయ ప్రక్రియ ఉంది. ఇలా ఫోన్ కాల్స్ చేసే వారిని నో ఫ్లై లిస్టులో పెట్టేందుకు నిబంధనలను సవరిస్తున్నట్లు తెలిపారు. ఫోన్ కాల్స్ ప్రారంభమైనప్పటి నుండి విమానయాన సంస్థలతో అనేక సమావేశాలు నిర్వహించినట్లు తెలియజేశారు. ఇప్పుడు ఎయిర్‌క్రాఫ్ట్ (సేఫ్టీ) నిబంధనలకు సవరణలను పరిశీలిస్తున్నామ‌ని వెల్ల‌డించారు.

రామ్ మోహన్ నాయుడు సూచన మేరకు సుస్కా చట్టాన్ని సవరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనిపై ఇతర మంత్రిత్వ శాఖలతోనూ చర్చిస్తున్నారు. కాగ్నిజబుల్ నేరాల కేటగిరీలోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రయాణికుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడబోమని మంత్రి చెప్పారు. ఇది చాలా సున్నితమైన సమస్య కాబట్టి పరిస్థితిని అంచనా వేయడంపై మా పూర్తి దృష్టి ఉందన్నారు.

దీనిపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖతో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో సీఐఎస్‌ఎఫ్ డీజీ, బీసీఏఎస్ డీజీ నుంచి బెదిరింపు కాల్స్‌పై పూర్తి సమాచారాన్ని హోంశాఖ కార్యదర్శి తీసుకున్నారు. బీసీఏఎస్ డీజీ, సీఐఎస్‌ఎఫ్ విచారణ స్టేటస్ రిపోర్టును కూడా సమావేశంలో అందించారు. మీడియా కథనాల ప్రకారం.. విదేశాల నుంచి బెదిరింపు కాల్స్ ఎక్కువగా వస్తున్నాయి.

బాంబు బెదిరింపులతో కూడిన ఫేక్ ఫోన్ కాల్స్ వల్ల విమానయాన సంస్థలు చాలా ఇబ్బంది పడుతున్నాయి. దీంతో విమానాల రాకపోకల్లో తీవ్ర జాప్యంతోపాటు ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతోంది. అందుకే ఇలాంటి ఫోన్ కాల్‌లను ఎదుర్కోవడానికి కఠినమైన నిబంధనలను రూపొందించాలని విమానయాన సంస్థలు కూడా సూచిస్తున్నాయి. బూటకపు బాంబు బెదిరింపుల వల్ల జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని కూడా వారు సూచిస్తున్నారు.

Next Story