రానున్న రోజుల్లో భారత్-బంగ్లాదేశ్ మైత్రి మరింత ఉన్నతస్థాయికి చేరుకుంటుంది : ప్రధాని మోదీ

Hasina lauds India, Modi says Bangladesh is biggest trade partner. భారత పర్యటనకు విచ్చేసిన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు.

By Medi Samrat  Published on  6 Sep 2022 3:00 PM GMT
రానున్న రోజుల్లో భారత్-బంగ్లాదేశ్ మైత్రి మరింత ఉన్నతస్థాయికి చేరుకుంటుంది : ప్రధాని మోదీ

భారత పర్యటనకు విచ్చేసిన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాల బలోపేతంపై సమీక్ష నిర్వహించారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఆసియా వ్యాప్తంగా చూస్తే బంగ్లాదేశ్ ఎగుమతులకు భారత్ అతిపెద్ద విపణిగా ఉందని.. ఈ వాణిజ్య పురోగతిని మరింత ముందుకు తీసుకెళతామని అన్నారు. ద్యైపాక్షిక సమగ్ర ఆర్థిక ఒప్పందం కుదుర్చుకునేందుకు త్వరలోనే చర్చలు జరుపుతామని.. రానున్న రోజుల్లో భారత్-బంగ్లాదేశ్ మైత్రి మరింత ఉన్నతస్థాయికి చేరుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆసియా ప్రాంతంలో భారత్ కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి బంగ్లాదేశ్ అని, అభివృద్ధిలోనూ భారత్ కు బంగ్లాదేశ్ అతిపెద్ద భాగస్వామి అని మోదీ అన్నారు. ప్రజల సహకారంలో నిరంతర అభివృద్ధి ఉంటుందని అన్నారు.

ఢిల్లీలో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో కలిసి సంయుక్త ప్రకటన విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోదీ భారత్-బంగ్లాదేశ్ మధ్య వాణిజ్యం వేగంగా పెరుగుతోందని అన్నారు. "ఐటి, అంతరిక్షం, అణు రంగాలలో సహకారాన్ని విస్తరించాలని మేము నిర్ణయించుకున్నాము. విద్యుత్ ప్రసార మార్గాలపై భారతదేశం, బంగ్లాదేశ్‌లో కూడా చర్చలు జరుగుతున్నాయి, "అని ప్రధాని మోదీ అన్నారు.

నీటి పంపిణీకి సంబంధించిన కీలక పత్రాలపై ఇరువురు నేతలు సంతకాలు చేశారు. "54 నదులు భారతదేశం-బంగ్లాదేశ్ సరిహద్దు గుండా ప్రవహిస్తాయి. రెండు దేశాల ప్రజల జీవనోపాధితో ముడిపడి ఉన్నాయి. ఈ రోజు, మేము కుషియారా నది నీటి భాగస్వామ్యానికి సంబంధించి ఒక ముఖ్యమైన ఒప్పందంపై సంతకం చేసాము, "అని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో కలిసి ఒక సంయుక్త ప్రకటనలో ప్రధాని మోదీ అన్నారు. బంగ్లాదేశ్ వరద పరిస్థితి, ఉగ్రవాదం, ద్వైపాక్షిక, ప్రాంతీయ- అంతర్జాతీయ సమస్యలపై ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మాట్లాడారు.

"వరద నివారణకు మేము మా సహకారాన్ని అందించాము. మేము బంగ్లాదేశ్‌ వరదలకు సంబంధించిన రియల్-టైమ్ డేటాను పంచుకుంటున్నాము. ఉగ్రవాదంపై కూడా చర్చించాము. మనకు వ్యతిరేకమైన శక్తులను మనం కలిసి ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది" అని ప్రధాని మోదీ అన్నారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను విజయవంతంగా పూర్తి చేసినందుకు భారత ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు.




Next Story