రేపే మంత్రివర్గ విస్తరణ.. టైమ్ ఫిక్స్ చేసిన సీఎం

Haryana cabinet expansion on Tuesday. మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలోని హర్యానా ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణ మంగళవారం

By Medi Samrat  Published on  27 Dec 2021 12:30 PM GMT
రేపే మంత్రివర్గ విస్తరణ.. టైమ్ ఫిక్స్ చేసిన సీఎం

మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలోని హర్యానా ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణ మంగళవారం జరుగుతుందని ముఖ్యమంత్రి కార్యాలయం సోమవారం తెలిపింది. ఇది గత రెండేళ్లలో రెండోది అని ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. రాష్ట్ర కేబినెట్‌లోని కొత్త మంత్రులు రేపు సాయంత్రం 4 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేస్తారని సిఎంఓ తెలిపింది. ఈ మేర‌కు "హర్యానా మంత్రివర్గం డిసెంబర్ 28, 2021న విస్తరించబడుతుంది. రాజ్‌భవన్‌లో సాయంత్రం 4 గంటలకు ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుంది" అని హిందీలో ట్వీట్ చేసింది.

రాష్ట్ర మంత్రివర్గంలోకి వ‌చ్చే అవకాశం ఉన్నవారిలో తోహానా నుండి జననాయక్ జనతా పార్టీ (జెజెపి) త‌రుపున గెలిచిన‌ ఎమ్మెల్యే దేవేందర్ సింగ్ బబ్లీ, ప్రస్తుతం హర్యానా అసెంబ్లీ స్పీకర్, పంచకుల నుండి ఎమ్మెల్యేగా ఉన్న జియాన్ చంద్ గుప్తా, హిసార్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన‌ డాక్టర్ కమల్ గుప్తా ఉన్నారు. 2019లో హర్యానాలో అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ-జేజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో ఇది రెండో మంత్రివర్గ విస్తరణ.

2019లో, హర్యానా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రెండు వారాల తర్వాత.. ఖట్టర్ తొలిసారిగా 10 మంది సభ్యులను తీసుకోవడం ద్వారా ఆ సంవత్సరం నవంబర్‌లో తన మంత్రి మండలిని విస్తరించారు. ప్రస్తుతం, రాష్ట్రంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో సహా 12 మంది కేబినేట్‌లో ఉన్నారు. 10 మంది మంత్రుల్లో ఎనిమిది మంది బీజేపీకి చెందిన వారు కాగా.. ఒకరు జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)కి చెందిన వారు, ఒక స్వతంత్రుడు ఉన్నారు. ఇప్పుడు మరో ఇద్దరు లేదా ముగ్గురు మంత్రులకు మంత్రివర్గంలో చోటు కల్పించవచ్చని స‌మాచారం.

2019లో జరిగిన హర్యానా ఎన్నికల్లో 90 మంది సభ్యులున్న అసెంబ్లీలో 40 సీట్లు గెలుచుకుని బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. 10 సీట్లు గెలుచుకున్న డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జేజేపీ, మరికొందరు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో భార‌తీయ జ‌న‌తా పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.


Next Story