9 గంటల ప్ర‌యాణం కేవలం 36 నిమిషాల్లోనే.. కీల‌క ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది.

By Medi Samrat
Published on : 5 March 2025 5:20 PM IST

9 గంటల ప్ర‌యాణం కేవలం 36 నిమిషాల్లోనే.. కీల‌క ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఇందులో కేదార్‌నాథ్‌ రోప్‌వే ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టు పొడవు 12.9 కిలోమీటర్లు. ఇందుకోసం దాదాపు రూ.4081 కోట్లు వెచ్చించనున్నారు. రోప్‌వే ప్రాజెక్ట్ సోన్‌ప్రయాగ్ నుండి ప్రారంభమై కేదార్‌నాథ్ వరకు సాగుతుంది. రోప్‌వే ప్రాజెక్టును ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తారు. మరోవైపు, హేమకుండ్ సాహిబ్ రోప్‌వే ప్రాజెక్టుకు రూ.2730 కోట్ల ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టు పొడవు 12.4 కిలోమీటర్లు.

కేదార్‌నాథ్ రోప్‌వే ప్రాజెక్టులో అత్యంత ఆధునిక సాంకేతికతను ఉపయోగించనున్నారు. ట్రై-కేబుల్ డిటాచబుల్ గొండోలా (3ఎస్) టెక్నాలజీతో రోప్‌వే నిర్మిస్తారు. రోప్‌వే ద్వారా ప్రతి గంటకు వన్ వే ద్వారా మొత్తం 1800 మంది ప్రయాణించవచ్చు. రోజులో 18000 మంది ప్రయాణించగలరు.

విశేషమేమిటంటే ఇప్పటి వరకు కేదార్‌నాథ్ ధామ్ చేరుకోవడానికి 8 నుంచి 9 గంటల సమయం పడుతుంది. కానీ రోప్‌వే ప్రాజెక్టు పూర్తయిన తర్వాత కేవలం 36 నిమిషాల్లోనే ప్రజలు ధామ్‌కు చేరుకోగలుగుతారు.

రోప్‌వే ప్రాజెక్ట్ కేదార్‌నాథ్‌ను సందర్శించే యాత్రికులకు ఒక వరంగా మారనుంది. ఈ రోప్‌వే పర్యావరణ అనుకూలమైనది.. సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా ఇప్పటి వరకు 8-9 గంటలు పట్టే ప్ర‌యాణ‌ దూరాన్ని కేవలం 36 నిమిషాల్లో కవర్ చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ కారణంగా ప‌లు ప్రాంతాల్లో కొత్త ఉపాధి అవకాశాలు ల‌భించ‌నున్నాయి.

రోప్‌వే ప్రాజెక్ట్ కేదార్‌నాథ్ ధామ్‌కు వచ్చే యాత్రికులకు నేరుగా ప్రయోజనం చేకూరుస్తుంది. ఏడాది పొడవునా సోన్‌ప్రయాగ్-కేదార్‌నాథ్ మధ్య కనెక్టివిటీ ఉంటుంది. కేదార్‌నాథ్ ధామ్ ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఉంది. సముద్ర మట్టానికి 11,968 అడుగుల ఎత్తులో ఉన్న 12 పవిత్ర జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి. ఈ ఆలయం అక్షయ తృతీయ నుండి దీపావళి వరకు సంవత్సరంలో దాదాపు 6 నుండి 7 నెలల వరకు యాత్రికుల కోసం తెరిచి ఉంటుంది. ఏటా 20 లక్షల మంది యాత్రికులు ఇక్కడికి వస్తుంటారు.

గోవింద్‌ఘాట్ నుండి హేమకుండ్ సాహిబ్ జీ వరకు 12.4 కి.మీ రోప్‌వే ప్రాజెక్ట్ ఆమోదించబడింది. ఇందుకోసం మొత్తం రూ.2730.13 కోట్లు వెచ్చించనున్నారు. ప్రస్తుతం, యాత్రికులు గోవింద్‌ఘాట్ నుండి హేమకుండ్ సాహిబ్ జీ వరకు 21 కిలోమీటర్లు కష్టతరమైన ప్రయాణం చేయాల్సి ఉంటుంది. గోవింద్‌ఘాట్ నుండి ఘంగారియా (10.55 కి.మీ) వరకు మోనోకేబుల్ డిటాచబుల్ గొండోలా (MDG)పై.. దీని తర్వాత ఇది అత్యంత అధునాతన ట్రైకేబుల్ డిటాచబుల్ గొండోలా (3S) సాంకేతికతతో ఘంగారియా నుండి హేమ్‌కుండ్ సాహిబ్ జీ (1.85 కి.మీ)కి అనుసంధానించబడుతుంది. ప్రతి గంటకు 1,100 మంది ప్రయాణికులు ఒక దిశలో ప్రయాణించగలరు. రోజంతా 11,000 మంది ప్రయాణికులు ప్రయాణించగలరు.

Next Story