టాటాకు దక్కిందన్న వార్తలు నిజం కాదు

Government After Report On Tata Sons Winning Air India Bid. ఎయిరిండియాను బిడ్డింగ్ లో టాటా గ్రూపు చేజిక్కించుకున్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

By Medi Samrat  Published on  1 Oct 2021 11:25 AM GMT
టాటాకు దక్కిందన్న వార్తలు నిజం కాదు

ఎయిరిండియాను బిడ్డింగ్ లో టాటా గ్రూపు చేజిక్కించుకున్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ వార్తల్లో నిజంలేదని స్పష్టం చేసింది. ఎయిరిండియా బిడ్డింగ్ లో టాటా గ్రూపు విజేతగా నిలిచినట్టు వచ్చిన కథనాలను ఖండించింది. 68 ఏళ్ల తర్వాత ఎయిరిండియా మళ్లీ టాటాల పరమైందంటూ జాతీయ మీడియాలో నేడు కథనాలు వచ్చాయి. ఎయిరిండియాను దక్కించుకునేందుకు స్పైస్ జెట్ తదితర సంస్థలు పోటీపడగా చివరికి టాటా సన్స్ నెగ్గిందని నేషనల్ మీడియాలో కథనాలు వచ్చాయి.

దీనిపై కేంద్ర పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం కార్యదర్శి సోషల్ మీడియాలో స్పష్టత ఇచ్చారు. ఎయిరిండియా బిడ్డింగ్ పూర్తయినట్టు వచ్చిన కథనాలు పూర్తిగా తప్పు అని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో బిడ్లకు కేంద్రం ఇంకా ఆమోదం తెలుపలేదని, కేంద్రం నుంచి ఏదైనా నిర్ణయం వస్తే మీడియాకు అధికారికంగా ప్రకటిస్తామని వివరించారు. రూ. 43 వేల కోట్ల నష్టాలతో నడుస్తున్న నేపథ్యంలో ఎయిరిండియాను వదిలించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రైవేట్ పరం చేయాలని భావించింది. 2020 మార్చి 31 నాటికి ఎయిరిండియాకు దాదాపు రూ. 45,863.27 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. ఎయిరిండియాను నిర్వహించేందుకు ప్రభుత్వానికి ప్రతి రోజు దాదాపు రూ. 20 కోట్ల భారం పడుతోంది.

స్వాతంత్ర్యానికి ముందు ఎయిరిండియాను టాటా గ్రూప్ నిర్వహించేది. జేఆర్డీ టాటా 1932లో ఎయిరిండియాను స్థాపించారు. భారత్ కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎయిరిండియాను జాతీయం చేశారు. దీంతో, ఎయిరిండియా ప్రభుత్వ రంగ సంస్థగా మారిపోయింది.


Next Story