అత్యాచారం కేసులో మాజీ మంత్రికి జీవిత‌ఖైదు

Gayatri Prajapati, former Akhilesh Yadav govt minister, gets jail for life in rape case. అత్యాచారం కేసులో ఉత్తరప్రదేశ్‌ మాజీ మంత్రి గాయత్రి ప్రసాద్‌ ప్రజాపతితో పాటు మరో ఇద్దరికి

By Medi Samrat  Published on  12 Nov 2021 2:37 PM GMT
అత్యాచారం కేసులో మాజీ మంత్రికి జీవిత‌ఖైదు

అత్యాచారం కేసులో ఉత్తరప్రదేశ్‌ మాజీ మంత్రి గాయత్రి ప్రసాద్‌ ప్రజాపతితో పాటు మరో ఇద్దరికి లక్నోలోని ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. వీరికి కోర్టు రూ. 2 ల‌క్ష‌ల చొప్పున‌ జ‌రిమానా కూడా విధించింది. స‌మాజ్‌వాదీ పార్టీకి చెందిన మాజీ మంత్రి, అతని సహచరులు త‌న‌తో పాటు త‌న మైన‌ర్ కుమార్తెపైనా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని చిత్రకూట్‌కు చెందిన ఓ మహిళ దాఖలు చేసిన ఫిర్యాదుపై 2017లో కేసు నమోదైంది. ఈ కేసులో ప్ర‌జప‌తిని, ఆయ‌న అనుచ‌రులిద్ద‌రిని ల‌క్నో ప్ర‌త్యేక న్యాయ‌స్ధానం రెండు రోజుల కింద‌ట దోషులుగా నిర్ధారించింది. ఈ కేసులో వికాస్ వర్మ, రూపేశ్వర్, అమరేంద్ర సింగ్ అలియాస్ పింటు, చంద్రపాల్ అనే నలుగురు నిందితులను సాక్ష్యాధారాలు లేకపోవడంతో న్యాయమూర్తి నిర్దోషులుగా ప్రకటించారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ మొత్తం 17 మంది సాక్షులను విచారించింది.

ఇదిలావుంటే.. అఖిలేష్ యాదవ్ క్యాబినెట్‌లో ప్రజాపతి కీలక సభ్యుడు, రవాణా, మైనింగ్ మంత్రిత్వ శాఖల పోర్ట్‌ఫోలియోలను నిర్వ‌హించారు. అప్ప‌ట్లో ఈ కేసు సంచ‌ల‌నం సృష్టించింది. తన ఫిర్యాదుపై పోలీసులు అల‌స‌త్వం వహించడంతో మహిళ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ప్రజాపతిపై గౌతంపల్లి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. మార్చిలో ప్రజాపతిని అరెస్టు చేయ‌గా.. అప్పటి నుండి జైలులో ఉన్నారు. ఇదిలావుంటే.. బాధిత మ‌హిళ‌ 2014 అక్టోబరు నుండి ప్రజాపతి, అతని సహచరులు తనపై అత్యాచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. జూలై 2016లో నిందితులు తన మైనర్ కుమార్తెను వేధించడానికి, అత్యాచారం చేయడానికి ప్రయత్నించడంతో వారిపై ఫిర్యాదు చేసింది. ప్రజాపతితో పాటు అత‌ని అనుచ‌రులు ఆశిష్ శుక్లా, అశోక్ తివారీలకు ఈ కేసులో శిక్ష పడింది. శుక్లా అమేథీలో మాజీ రెవెన్యూ క్లర్క్ కాగా, తివారీ కాంట్రాక్టర్‌గా పనిచేశారు.


Next Story