Former PM Deve Gowda fined Rs 2 crore in defamation case. మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడకు బెంగళూరు కోర్టు భారీ జరిమానా విధించింది.
By Medi Samrat Published on 22 Jun 2021 12:59 PM GMT
మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడకు బెంగళూరు కోర్టు భారీ జరిమానా విధించింది. ఓ నిర్మాణ సంస్థ పరువుకు భంగం వాటిల్లేలా వ్యాఖ్యలు చేసినందుకు గాను న్యాయస్థానం ఊహించని షాక్ ఇచ్చింది. ఈ మేరకు పరువు నష్టం కేసులో రూ.2 కోట్లు చెల్లించాలని దేవెగౌడను ఆదేశించింది. 2011 జూన్లో ఓ కన్నడ వార్తా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ఎంటర్ప్రైజ్పై దేవెగౌడ వ్యాఖ్యలు చేశారు. దీంతో తమ పరువుకు భంగం వాటిల్లిందని ఆరోపిస్తూ.. ఆ సంస్థ ఎండీ, బీదర్ దక్షిణ మాజీ ఎమ్మెల్యే అశోక్ ఖేనై.. దేవెగౌడ నుంచి రూ.10 కోట్లు డిమాండ్ చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
దీనిపై విచారణ జరిపిన బెంగళూరులోని సిటీ సివిల్ అండ్ సెషన్స్ అదనపు న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ప్రాజెక్టు కోసం అవసరమైన దానికంటే ఎక్కువ భూమిని వినియోగించిందని గౌడ చేసిన ఆరోపణలు సరికాదని కంపెనీ తరపు న్యాయవాది వాదించారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ఎంటర్ప్రైజ్పై ఇంటర్వ్యూలో చేసిన తన వాదనను ధృవీకరించడంలో దేవగౌడ విఫలయ్యారని కోర్టు తేల్చింది. సంస్థకు రూ.2 కోట్లు పరిహారం చెల్లించాలని దేవగౌడను సివిల్ కోర్ట్ న్యాయమూర్తి మల్లన గౌడ ఆదేశించారు.