'పింక్ ఏనుగు' ఫోటోషూట్.. నెట్టింట తీవ్ర దుమారం..!

రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన ఒక ఫోటోషూట్ సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపింది.

By -  Medi Samrat
Published on : 31 March 2026 12:04 PM IST

పింక్ ఏనుగు ఫోటోషూట్.. నెట్టింట తీవ్ర దుమారం..!

రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన ఒక ఫోటోషూట్ సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపింది. ఒక విదేశీ ఫోటోగ్రాఫర్ ఏనుగుకు ముదురు గులాబీ రంగు వేయడంతో, జంతు హింసపై విస్తృత విమర్శలు, ఖండనలు వెల్లువెత్తాయి.

రష్యన్ ఫోటోగ్రాఫర్ జూలియా బురులేవా జైపూర్‌లో ఒక ఫోటోషూట్ నిర్వహించారు. నవంబర్ 2025 నాటివని చెబుతున్న ఈ ఫోటోలలో ఒక మోడల్‌తో పాటు గులాబీ రంగు ఏనుగు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఇవి మళ్లీ వెలుగులోకి వచ్చిన తర్వాత.. సృజనాత్మక పనులలో జంతువులను వస్తువులుగా చూపించడంపై వన్యప్రాణి ప్రేమికులు, సోషల్ మీడియా వినియోగదారులు తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తారు. చాలామంది దీనిని జంతు హింస అని పిలుస్తున్నారు.

బురులేవా మొదటగా డిసెంబర్ 27, 2025న ఇన్‌స్టాగ్రామ్‌లో గులాబీ ఏనుగు పోస్ట్‌ను పంచుకున్నారు. ఆ తర్వాత ఫిబ్రవరి 18న ఒక పోస్ట్‌లో ఆమె స్పష్టతనిస్తూ.. “ఏనుగు గురించి ఆందోళన చెందుతున్న ఎవరికైనా – మేము పండుగలకు స్థానికులు ఉపయోగించేటువంటి సేంద్రీయ, స్థానికంగా తయారు చేసిన పెయింట్‌నే వాడాము, కాబట్టి అది ఆ జంతువుకు పూర్తిగా సురక్షితమైనది” అని అన్నారు.

సోమవారం నాడు ఆమెర్‌లోని ఏనుగుల గ్రామ సభ్యులు మాట్లాడుతూ.. కేవలం మూలికా రంగులను మాత్రమే ఉపయోగించారని, ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు చిత్రీకరణ జరిగిన 30 నిమిషాలలోపే ఏనుగును శుభ్రం చేశారని తెలిపారు. అయితే ఆన్‌లైన్‌లో చాలా మంది ఈ ఫోటోషూట్‌ను ఖండించారు.

Next Story