సీఎం కార్యాలయంలో అగ్ని ప్రమాదం
Fire breaks out at Mamata Banerjee's office. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కార్యాలయంలో మంగళవారం అగ్ని ప్రమాదం
By Medi Samrat Published on 12 Oct 2021 10:54 AM GMT
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కార్యాలయంలో మంగళవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నబన్నాలోని సచివాలయం 14వ అంతస్తులో ఉన్న సీఎం మమతా కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కార్యాలయంలో నుంచి పొగలు రావడం గమనించిన పక్కనే గ్రౌండ్లో పని చేస్తున్న కార్మికులు.. అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక దళం, ఎన్డీఆర్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి.
మంటలను అదుపు చేయడానికి మూడు అగ్నిమాపక శకటాలను రంగంలోకి దించినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు. అయితే.. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. దుర్గాపూజ సందర్భంగా సెలవు కారణంగా సచివాలయాన్ని మూసివేశారు. అగ్నిప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అయితే.. కార్యాలయంలో జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సివుంది. గతంలో కూడా ఇక్కడ అగ్నిప్రమాదం జరిగిందని తెలుస్తోంది.