రైతు ఉద్యమానికి దేశ వ్యాప్తంగా పెరుగుతున్న మద్దతు

Farmers protest live updates. నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని, కనీస మద్దతు ధరను కొనసాగించాలని డిమాండ్ చేస్

By Medi Samrat  Published on  2 Dec 2020 11:00 AM GMT
రైతు ఉద్యమానికి దేశ వ్యాప్తంగా పెరుగుతున్న మద్దతు

నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని, కనీస మద్దతు ధరను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ హర్యానా, పంజాబ్ రైతులు చేస్తున్న ఆందోళన ఉద్ధృతమవుతోంది. వారి మీద జరిగిన దాడిని పలువురు నాయకులు తప్పుబట్టారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. అన్నదాతకు ప్రతి ఒక్కరు రుణ పడి ఉండాలని, వారిని లాఠీలతో కొట్టించడం, వాటర్ క్యానన్లు ఉపయోగించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తన అహాన్ని విడిచిపెట్టి రైతులకు వారి హక్కులను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఎన్నికలప్పుడు వారి వద్దకు వెళ్లి ఓట్లు అడుగుతారని, ఇప్పుడు వారు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా చర్చలు జరిపేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు పాకిస్థాన్ నుంచి వచ్చారని వాటర్ క్యానన్లు ప్రయోగించారా? అని ప్రశ్నించారు. దేశానికి అన్నదాతలే ప్రాణాధారమని, వారికి అండగా నిలవాల్సిన సమయం ఇదేనని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు.

వివిధ రాజకీయ పార్టీలతోపాటు క్రీడాకారుల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. రైతుల ఆందోళనపై బలగాలను ప్రయోగించడాన్ని తప్పుబట్టిన పలువురు మాజీ క్రీడాకారులు వారికి మద్దతుగా నిలిచారు. గతంలో తాము అందుకున్న పురస్కారాలను వెనక్కి ఇవ్వాలని నిర్ణయించారు. అర్జున అవార్డు, పద్మశ్రీ పురస్కార గ్రహీత, బాస్కెట్ బాల్ క్రీడాకారుడు కర్తార్ సింగ్; అర్జున అవార్డు గ్రహీత, బాస్కెట్ బాల్ క్రీడాకారుడు సజ్జన్ సింగ్ చీమా, అర్జున అవార్డు గ్రహీత, హాకీ క్రీడాకారుడు రాజ్‌బీర్ కౌర్ తదితరులు డిసెంబర్ 5న రైతుల ఆందోళనలో పాల్గొని, రాష్ట్రపతి భవన్ బయట తమ పురస్కారాలను వదిలిపెట్టాలని నిర్ణయించారు.

Next Story