ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్) పెన్షనర్లకు శుభవార్త చెప్పింది ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో). పెన్షనర్లు ఇకపై ఇంటి నుంచే డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ను సమర్పించే విధానాన్ని ప్రారంభించింది. దీని కోసం ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (ఐపీపీబీ)తో ఈపీఎఫ్వో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రత్యేకంగా బ్యాంకులు లేదా ఈపీఎఫ్ కార్యాలయాలకు వెళ్లలేని వృద్ధులు, మొబైల్ ఫోన్ ద్వారా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించలేని పెన్షనర్లను దృష్టిలో ఉంచుకుని ఈ సదుపాయాన్ని తీసుకొచ్చినట్లు ఈపీఎఫ్వో తెలిపింది. ఈ విధానంలో భాగంగా ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకుకు చెందిన పోస్ట్ మ్యాన్ లేదా డాక్ సేవక్ నేరుగా పెన్షనర్ ఇంటికే వెళ్లి డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ప్రక్రియను పూర్తి చేస్తారు. డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ పొందాలనుకునే పెన్షనర్లు ఐపీపీబీ కస్టమర్ కేర్ నంబర్కు కాల్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత పోస్ట్ మ్యాన్ లేదా డాక్ సేవక్ ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ వెరిఫికేషన్ ద్వారా సర్టిఫికెట్ను పూర్తి చేస్తారు. ఒకసారి సమర్పించిన డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ఒక సంవత్సరం పాటు చెల్లుబాటు అవుతుంది. ఈ సేవకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు.