మంచు కురిసే వేళలో.. మల్లె విరిసేదెందుకో.. మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో.. ఎందుకో.. అనే పాట వింటే ఎంత హాయిగా ఉంటుందో.. ఆ గ్రామంలో కాసేపు సేద తీరితే మనసుకు కూడా అంతే ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ గ్రామంలో చలికాలం ప్రారంభం కాకముందే మంచు కురవడం మొదలైంది. హిమాచల్ప్రదేశ్ రాష్ట్రంలోని లాహౌల్-స్పితి జిల్లాలో మంచు దుప్పట్లు కనవిందు చేస్తున్నాయి. ధన్కర్ గ్రామంపై తేట తెల్లని వస్త్రం పరిచినట్లుగా కనిపిస్తోంది. గ్రామం చుట్టు ఉన్న కొండలు పూర్తిగా మంచుతో కప్పబడి ఉన్నాయి.
మంచు దృశ్యాలు అక్కడున్న వారి మనసులకు ఆహ్లాదాన్ని అందిస్తున్నాయి. ఈ దృశ్యాలు అక్కడున్న వారికి కొత్త కాకపోయిన.. టూరిస్ట్లకు మాత్రం కొత్తే. ఇలాంటి మంచు దృశ్యాలు చూసే అవకాశం చాలా తక్కువ సందర్భాల్లో లభిస్తుంది. హిమాలయాలకు సమీపంలోని రాష్ట్రాల్లో మంచు కురవడం మొదలైంది. ముఖ్యంగా జమ్ముకశ్మీర్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరఖండ్ రాష్ట్రాల్లో మంచు కురుస్తోంది. మంచు కురిసే దృశ్యాలను చూడాలనుకునే వారు.. ఇప్పుడే హిమాలయాలకు బయలుదేరొచ్చు.