దేశ రాజధాని ఢిల్లీ నగరంలో సోమవారం తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో ఢిల్లీ ప్రజలు గత కొద్ది రోజులుగా ఉన్న వేడి నుంచి ఉపశమనం పొందారు. ఇక బలమైన గాలుల ప్రభావంతో రాజధాని నగరంలోని కొన్ని ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి, దీని ఫలితంగా పలు రోడ్లు మూతపడ్డాయి.
ప్రతికూల వాతావరణం కారణంగా ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ (ఐజీఐ) విమానాశ్రయంలో కార్యకలాపాలు కూడా నిలిపివేయబడ్డాయి. సమాచారం కోసం సంబంధిత విమానయాన సంస్థను సంప్రదించాలని విమానాశ్రయ అధికారులు ప్రయాణికులను అభ్యర్థించారు. ఈ మేరకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ ట్వీట్ చేసింది.
ఇదిలావుండగా.. రానున్న రెండు గంటల పాటు ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. ఈదురు గాలులు, ఉరుములతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు తీవ్రతతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. గంటకు 50-80 కిమీ/గం వేగంతో ఈదురు గాలులు వచ్చే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. ఢిల్లీ-ఎన్సిఆర్.. పరిసర ప్రాంతాలలో ఈ పరిస్థితులు కొనసాగేఅవకాశం ఉందని.. వీలైతే ప్రజలు ప్రయాణాలకు దూరంగా ఉండటమే కాకుండా ఇళ్లలోనే ఉండాలని సూచిస్తూ IMD ట్వీట్ చేసింది.
అంతకుముందు శనివారం, దేశ రాజధానిలోని కొన్ని ప్రాంతాలలో వర్షం కురిసింది, ఫలితంగా కనిష్ట ఉష్ణోగ్రత 23.1 డిగ్రీల సెల్సియస్కు పడిపోయింది, సగటు కంటే మూడు పాయింట్లు తక్కువ.